పొరుగు దేశానికి మన ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌’తో సాయం

పొరుగు దేశానికి మన ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌’తో సాయం

కోల్‌కతా: ప్రపంచమంతా ఒకే కుటుంబం అన్న సిద్ధాంతాన్ని నమ్మే కర్మ భూమి భారత్. ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది మన కేంద్ర ప్రభుత్వం. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ టైమ్‌లో ఆక్సిజన్‌ కొరతను తీవ్రంగా రావడంతో ఇండియన్ రైల్వే ప్రారంభించిన సర్వీస్ ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’ను పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌కు కూడా నడుపుతోంది. ఈ ట్రైన్ల ద్వారా మన దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్న స్టీల్‌ ప్లాంట్లు, ఇతర పరిశ్రమల్లో ఉత్పత్తి అయిన ఆక్సిజన్‌ను షార్టేజ్ ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు వేగంగా తరలించారు. ఖాళీ ట్యాంకులను పరిశ్రమలకు పంపి, ఆక్సిజన్‌ నింపిన తర్వాత వేగంగా ఆయా రాష్ట్రాలకు చేర్చి, అక్కడి నుంచి ఆస్పత్రులకు లారీల ద్వారా పంపారు. అయితే ఇప్పుడు ఈ ట్రైన్ సర్వీసులను మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌కు కూడా పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. జార్ఖండ్‌లోని చక్రధర్‌‌పూర్‌‌ నుంచి  తొలిసారి ట్రైన్‌లో 200 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను ట్రైన్‌ ద్వారా తీసుకెళ్తున్న వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ట్వీట్‌ చేశారు.
‘‘వసుధైక కుటుంబం (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అన్న సిద్ధాంతం మన సంప్రదాయంలో అనాదిగా ఉంది. కరోనా మహమ్మారి నుంచి మానవాళిని కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత రైల్వేస్‌ నిరంతరం కృషి చేస్తోంది. 200 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో తొలిసారి ఎక్స్‌ప్రెస్ ఈ రోజు ఉదయం బంగ్లాదేశ్‌కు బయలుదేరి వెళ్లింది” అని ఆయన ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు.

నాడు సాయం చేసిన ఇండోనేషియాకు 100 టన్నులు

కష్ట సమయంలో మనల్ని ఆదుకున్న మిత్రులను, వాళ్లకు ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడం మిత్ర ధర్మం. ఇప్పుడు సరిగ్గా అదే పనిని భారత సర్కార్ చేసింది. కరోనాసెకండ్ వేవ్‌తో మనం నానా కష్టాలు ఎదుర్కొన్న మే నెలలో ఇండోనేషియా 1,400 ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌‌లను పంపింది. మన ఆక్సిజన్ కొరతను తీర్చడంలో తన వంతు సాయం చేసింది ఇండోనేషియా ప్రభుత్వం. క్రమంగా మనం ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచుకోవడం, మరోవైపు కరోనా కేసులు కొంత మేర తగ్గుముఖం పట్టడంతో ఆ సమస్య తీరింది. అయితే నాడు మనం ఎదుర్కొన్న సమస్య ఇప్పుడు ఇండోనేషియా ఫేస్‌ చేస్తోంది. కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో ఆక్సిజన్ కొరత ఏర్పడి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దీంతో సాయంగా భారత ప్రభుత్వం 100 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్‌తో పాటు 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపింది. ఇండియన్ నేవీ షిప్ ఐరావత్‌ ఈ సాయాన్ని శనివారం ఇండోనేషియాకు చేర్చింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. కరోనాపై కలిసి పోరాటం చేస్తున్నామని, 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 100 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను నింపుకొన్న ఐదు క్రయోజెనిక్ ట్యాంకులతో ఐఎన్‌ఎస్ ఐరావత్ ఇండోనేషియాకు చేరుకుందని ఆయన ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు. వాస్తవానికి ఆ షిప్‌ ఈ నెల 19నే అక్కడికి చేరుకోవాల్సి ఉన్నప్పటికీ, ప్రయాణంలో ఆలస్యమైందని చెప్పారు. కాగా, ప్రస్తుతం ఇండోనేషియాలో రోజువారీ కరోనా కేసులు సుమారు 49 వేలకు పైగా వస్తున్నాయి. ఇటీవల కేసులు ఒక్కసారిగా భారీగా పెరిగిపోవడంతో అక్కడి ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది.

.