
హోవ్: ఛేజింగ్లో వైభవ్ సూర్యవంశీ (19 బాల్స్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 48), అభిగ్యాన్ కుండు (45 నాటౌట్) దంచికొట్టడంతో.. ఇంగ్లండ్ అండర్–19తో జరుగుతున్న యూత్ వన్డేలో ఇండియా అండర్–19 జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇండియా 1–0 లీడ్లో నిలిచింది. టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 42.2 ఓవర్లలో 174 రన్స్కు ఆలౌటైంది. రాకీ ఫ్లింటాఫ్ (56) టాప్ స్కోరర్. ఇసాక్ మహ్మద్ (42) మెరుగ్గా ఆడాడు. డాకిన్స్ (18), బెన్ మైస్ (16), జేమ్స్ మింటో (10)తో సహా మిగతా వారు నిరాశపర్చారు.
ఇండియా బౌలింగ్ ధాటికి ఇన్నింగ్స్లో ఆరుగురు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. కనిష్క్ చౌహాన్ 3, హెనిల్ పటేల్, అంబ్రిష్, మహ్మద్ ఇనామ్ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత ఇండియా 24 ఓవర్లలో 178/4 స్కోరు చేసి నెగ్గింది. స్టార్టింగ్ నుంచే భారీ హిట్టింగ్ చేసిన సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (21) తొలి వికెట్కు 71 రన్స్ జోడించి శుభారంభాన్నిచ్చారు. విహాన్ మల్హోత్రా (18), మౌల్యరాజ్సిన్హ్ చావ్డా (16) ఫెయిలయ్యారు. ఏఎం ఫ్రెంచ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇరుజట్ల మధ్య రెండో మ్యాచ్ సోమవారం జరుగుతుంది.