
మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: మేడ్చల్ జిల్లాకు మంజూరైన 1,409 ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ నెలాఖరులోగా పూర్తి చేయాలని మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ మను చౌదరి జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో మాట్లాడారు. జిల్లాకు మంజూరైన ఇళ్లను పది రోజుల్లోగా వంద శాతం గ్రౌండింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
స్థానిక కోటాకు సంబంధించిన వెయ్యి డబుల్ బెడ్రూం ఇళ్లను ఎల్ 2 జాబితాలో ఉన్న వారికి కేటాయించాలని కలెక్టర్ ఆదేశించారు. డబ్బులు లేక ఇందిరమ్మ ఇళ్ల బేస్మెంట్ నిర్మాణం చేయలేక పోతున్న వారిని మహిళా సంఘాల్లో చేర్పించి, రూ.లక్ష మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాధికా గుప్త, జిల్లా హౌసింగ్ పీడీ రమణ మూర్తి, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.