
- ఇప్పటికే 3 లక్షల ఇండ్లు మంజూరు: మంత్రి పొంగులేటి
- ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితంగా ఇస్తున్నాం
- ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని బట్టి ప్రతి సోమవారం చెల్లింపులు చేస్తున్నట్టు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా.. ఇందులో 2.37 లక్షల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందచేశామని, ఇందులో 1.03 లక్షల ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మంగళవారం సెక్రటేరియెట్లో ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రివ్యూ నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా రూ. 22,500 కోట్లతో నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని తెలిపారు. ఈ నెల 23 వరకు జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 95 నియోజకవర్గాలకుగానూ 88 నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని చెప్పారు.
వర్షాకాలం సీజన్ ను దృష్టిలో పెట్టుకొని గ్రౌండింగ్ అయిన ఇండ్లను వీలైనంత త్వరగా బేస్మెంట్ పనులు పూర్తి చేసుకునేలా నిరంతరం మానిటరింగ్ చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఇండ్ల మంజూరు, గ్రౌండింగ్ లో సూర్యాపేట, పెద్దపల్లి, భూపాలపల్లి, హనుమకొండ, వికారాబాద్, సిద్దిపేట, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల పనితీరు మరింత మెరుగు పడాలని, తక్షణమే ఆయా జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి సోమవారం చెల్లింపులు
ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం ఒక్కో ఇంటి కోసం 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ ప్రయోజనాన్ని పూర్తిస్థాయిలో లబ్ధిదారులు పొందేలా క్షేత్ర స్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని బట్టి లబ్ధిదారులకు ప్రతి సోమవారం చెల్లింపులు జరుపుతున్నామని తెలిపారు.
ఇంటి స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇప్పటివరకు కేటాయించని డబుల్ బెడ్ ఇండ్లను ఇవ్వాలని, అలాగే మొండి గోడలతో ఉన్న డబుల్ ఇండ్లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ ముందుకు రాని పక్షంలో లబ్ధిదారులే పూర్తి చేసుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వమే అందిస్తుందని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ లు అసంపూర్తిగా ఉన్న జీహెచ్ఎంసీ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు.