ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు..ఆడబిడ్డల పేరుతోనే : సీఎం రేవంత్​రెడ్డి

ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు..ఆడబిడ్డల పేరుతోనే :  సీఎం రేవంత్​రెడ్డి

 

 

 

 

  • రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇండ్లు కట్టిస్తం 
  • ఇందిరమ్మ ఇండ్ల పథకం భద్రాచలంలో ప్రారంభం
  • డబుల్​ బెడ్రూం ఇండ్ల పేరుతో కేసీఆర్​ ఓట్ల వ్యాపారం చేసిండు
  • అందుకే జనం ఆయన పాలనను బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నరు

భద్రాచలం, వెలుగు : పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇండ్ల పథకం లక్ష్యమని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేది ఇల్లే. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టు లెక్క. అందుకే ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను ఆడబిడ్డల పేరుతో ఇవ్వాలని నిర్ణయించినం. రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇండ్లు కట్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నం..’’ అని స్పష్టం చేశారు. ఆరుగ్యారంటీల అమలులో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్​ను సోమవారం భద్రాచలంలో సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించారు.

అనంతరం సభలో మాట్లాడుతూ.. భద్రాద్రి రాముడి సాక్షిగా ఐదో గ్యారంటీ కింద ఇండ్ల స్కీంను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజాపాలనలో 92 రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఐదింటిని అమలు చేసి చూపించామని, కాంగ్రెస్​ పార్టీ అంటే మాటలు కాదు చేతల ప్రభుత్వమని ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టామని చెప్పారు. ‘‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నం.. ఈ స్కీమ్​ద్వారా ఇప్పటికే 24 కోట్ల ఫ్రీ జర్నీలు జరిగినయ్​. రాజీవ్​ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల ఉచిత వైద్యం అమలవుతున్నది.  రూ.500కే గ్యాస్​బండ ఇస్తున్నం. జీరో కరెంట్​ బిల్లు, ఇందిరమ్మ ఇండ్లు.. ఇట్ల అన్నీ చేసి చూపిస్తున్నం.. ’’ అని ఆయన పేర్కొన్నారు. 

పీఎం ఆవాస్​ యోజన కింద ఎన్ని ఇండ్లు కట్టిన్రు?

‘‘ప్రధాన మంత్రి ఆవాస్​ యోజన కింద తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు కట్టారో? దమ్ముంటే బీజేపీ స్టేట్​ చీఫ్​, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్​ చూపించాలి’’ అని సీఎం రేవంత్​ సవాల్​ విసిరారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తానన్న ప్రధాని మోదీ ఢిల్లీ సరిహద్దుల్లో గిట్టుబాటు ధర కోసం దీక్షలు చేస్తుస్తున్న రైతులను బలిదీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. స్విస్​ బ్యాంకుల నుంచి నల్లధనం తెచ్చి పేదోళ్ల బ్యాంకు ఖాతాల్లో రూ.15లక్షల చొప్పున వేస్తానని మోదీ చెప్పారని, మరి ఎంత మంది ఖాతాల్లో వేశారో చూయించాలని అన్నారు.

ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోదీ.. పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ లెక్కన తెలంగాణలో 60 లక్షల నుంచి 70 లక్షల ఉద్యోగాలు రావాలి. మరి అవన్నీ ఎక్కడున్నయో చూపించాలి” అని డిమాండ్​ చేశారు.  ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా కేంద్రంలోని మోదీని అడుగుతామని, కడిగేస్తామని, బండకేసి రుద్దుతామని ఆయన అన్నారు. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్​ను అన్ని స్థానాల్లో గెలిపించాలని ప్రజలను కోరారు. 

పదేండ్లలో మీరు చేసిందేమిటి?

రాష్ట్రంలో కేసీఆర్​, కేంద్రంలో మోదీ కలిసి పదేండ్లలో ఏం చేశారో జనాలకు చెప్పి ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడగాలని సీఎం రేవంత్​ అన్నారు. ‘‘ఇద్దరూ కలిసి రూ.400 ఉండే గ్యాస్ ధరను రూ.1,200 చేసిన్రు. లీటర్​ పెట్రోల్​ను రూ.55 నుంచి 110కి, లీటర్​ డీజిల్​ను రూ.50 నుంచి 100కు పెంచిన్రు. కేసీఆర్​కు ఒకటే సవాల్​ విసురుతున్న.. నువ్వు ఏ గ్రామాల్లో  డబుల్​బెడ్రూం ఇండ్లు కట్టించినవో అక్కడికి వెళ్లి ఓట్లు అడుగు. పదేండ్ల కింద కాంగ్రెస్​ కట్టించిన ఇందిరమ్మ ఇండ్లు ఉన్న గ్రామాల్లోకి వెళ్లి మేము ఓట్లు అడుగుతం’’ అని తేల్చిచెప్పారు. డబుల్​బెడ్రూం ఇండ్ల పేరుతో కేసీఆర్​ పదేండ్ల పాటు ఓట్ల వ్యాపారం చేశారని మండిపడ్డారు. ‘‘పదేండ్ల పాటు కేసీఆర్​ చెప్పిన కథనే మళ్లీ మళ్లీ చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసిండు. అందుకే  కేసీఆర్​ పాలనను బొందపెట్టి ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నరు’’ అని సీఎం పేర్కొన్నారు.