కాంగ్రెస్​కు ఓటేస్తే చీకటే: మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి

కాంగ్రెస్​కు ఓటేస్తే చీకటే:  మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి

సారంగాపూర్, వెలుగు: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్​కు ఓటేస్తే చీకటే మిగులుతుందని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి అన్నారు. 24 గంటల కరెంటుపై టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం సారంగాపూర్​మండలంలోని స్వర్ణ గ్రామంలో నిర్వహించిన రైతు వేదికలో ఆయన మాట్లాడారు. ఎన్ని గంటలు నీరు పారిస్తే ఎన్ని ఎకరాలకు నీరు అందుతుందో రేవంత్​రెడ్డికి కనీస అవగాహన లేదన్నారు.  తెలంగాణ రాకముందు వ్యవసాయానికి రాత్రిపూట మాత్రమే కరెంట్​ఇచ్చేవారని, రాత్రంతా జాగారం చేస్తూ రైతులు పాము కాట్లకు గురయ్యేవారని గుర్తుచేశారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి రైతులు గట్టెక్కారని, ఇది చూసి కాంగ్రెస్​పార్టీ ఓర్వలేకపోతోందని మండిపడ్డారు. 3 గంటలు కరెంట్​ఇస్తామన్న కాంగ్రెస్​ కావాలా? మూడు పంటలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న కేసీఆర్ కావాలో ఆలోచించుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నల్ల వెంకటరామిరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్​రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్​రెడ్డి, అడెల్లి దేవాలయ చైర్మన్ అయిటి చందు, టీసీసీబీ డైరెక్టర్​నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీసీ కులవృత్తులకు సర్కారు అండ

నిర్మల్: బీసీ కులవృత్తులకు బీఆర్​ఎస్ సర్కారు అండగా ఉంటోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​ఆఫీస్​లో బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కులను కలెక్టర్​వరుణ్​రెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులవృత్తిదారులను ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. జిల్లాలో మొదటి విడతగా నియోజకవర్గానికి 50 మందికి రూ.లక్ష సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో నిరాదరణకు గురైన కులవృత్తుదారులను సీఎం కేసీఆర్​ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​రాంబాబు, మున్సిపల్​చైర్మన్​ఈశ్వర్​తదితరులు పాల్గొన్నారు.

రైతుల అభివృద్ధిని ఓర్వలేక..

తిర్యాణి: రైతులకు కరెంట్​సరఫరాపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. గురువారం తీర్యాణిలోని చింతపల్లి, గిన్నెదరి రైతు వేదికలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రైతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతుంటే ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక తమ నిజస్వరూపాలను బయటపెడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మర్సకోల శ్రీదేవి, జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు మడావి గుణవంత్ రావు, సర్పంచ్​ల సంఘం మండల అధ్యక్షుడు కుర్సెంగ బాదిరావు తదితరులు పాల్గొన్నారు.