ప్రైవేట్ హాస్పిటల్​లో ఆఫీసర్ల తనిఖీ

ప్రైవేట్ హాస్పిటల్​లో ఆఫీసర్ల తనిఖీ

సిద్దిపేట రూరల్ : ప్రైవేట్ హాస్పిటల్​లో తనిఖీ చేసిన ఆఫీసర్లు సర్కారు మెడిసిన్స్​ స్వాధీనం చేసుకున్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ లో డిప్యూటీ డీఎంహెచ్ వో శ్రీనివాస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పవన్ తనిఖీలు చేశారు. కాలం చెల్లిన ప్రభుత్వ ఔషధాలు, ఐవీ ప్లూయిడ్స్, గ్లౌజ్​లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విజయలక్ష్మి హాస్పిటల్ లో ప్రభుత్వ మెడిసిన్ వాడుతున్నారన్న ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు.

తనిఖీల్లో ప్రభుత్వ మందులు గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహించే డాక్టర్ ప్రభుత్వ అసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో డ్యూటీ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. మందులు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయమై పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో ఓ గదికి తాళం వేసి ఉండటంతో తనిఖీ చేయలేకపోయినట్లు చెప్పారు. శుక్రవారం పోలీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో రూం తెరిచి తనిఖీలు చేస్తామన్నారు.