యాదాద్రి భువనగిరి జిల్లా: స్వాతంత్ర్యం వచ్చి 74 సంవత్సరాలైనా ఇంకా దళితులపై వివక్ష తగ్గడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు భువనగిరి మండలంలోని, వీరవెల్లి గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు కంచి లలిత మల్లయ్య. శనివారం వీరవెల్లిలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎంపీటీసీగా తనకు సరైనా గౌరవం దక్కలేదని కన్నీరుమున్నీరయ్యారు. సర్పంచ్ తర్వాత పిలువాల్సిన తనను.. వార్డు సభ్యుల తర్వాత స్టేజ్ పైకి ఆహ్వానించారని చెప్పారు. గతంలోనూ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలల్లో దళితురాలిని అని తనను అవమాన పరిచారని, ప్రోటోకాల్ పాటించకుండా చిన్నచూపు చూస్తున్నారని చెప్పారు. పలు కార్యక్రమాలల్లో కొబ్బరికాయ కొట్టే విషయంలోనూ ఇలాగే చిన్నచూపు చూస్తున్నారని చెప్పుకొచ్చారు.
దళితురాలిని అని, తనపై అనునిత్యం వివక్ష చూపుతున్న సర్పంచ్ తంగెళ్లపల్లి కల్పన శ్రీనివాసచారి, గ్రామ పంచాయతీ కార్యదర్శీ సంతోష్ కుమార్, ఉప సర్పంచ్ కరిమలమ్మజార్జిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. తాజాగా మరోసారి అవమానానికి గురికావడంతో.. తనను అవమానానికి గురి చేస్తున్నవారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. తనకు న్యాయం జరగకపోతే నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు ఎంపీటీసీ సభ్యురాలు కంచి లలిత మల్లయ్య.