బతికున్న వ్యక్తి పేరు మీద డెత్​ఇన్సూరెన్స్​ క్లెయిమ్​

బతికున్న వ్యక్తి పేరు మీద డెత్​ఇన్సూరెన్స్​ క్లెయిమ్​
  • ఫేక్​ సర్టిఫికెట్లతో సొమ్ము కాజేసిన గుర్తు తెలియని వ్యక్తులు
  • ఆర్టీఐకి  అప్లై‌‌ చేసిన బాధితుడు

కాగజ్ నగర్, వెలుగు : ఓ తాపీ మేస్త్రీ బతికుండగానే అతడి పేరు మీద గుర్తుతెలియని వ్యక్తులు డెత్ ఇన్సూరెన్స్ క్లెయిమ్​ చేసుకున్నారు. కుమ్రం భీం అసిఫాబాద్​ జిల్లా బెజ్జుర్​ మండల కేంద్రానికి చెందిన కోట రాజన్న తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. 2018 మార్చిలో లేబర్​ ఇన్సూరెన్స్​ తీసుకున్నాడు. ఇటీవల రెన్యువల్​ కోసం లేబర్​ ఆఫీస్​కు వెళ్లగా అతడి పేరుపై మరణ ధ్రువపత్రాలు సమర్పించి లేబర్ ఇన్సూరెన్స్ ను తీసుకున్నట్లు అక్కడి ఆఫీసర్లు చూపించారు.  

తాను బతికే ఉన్నానని, తన పేరు మీద డెత్​ ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్​ చేసుకుంటారని ప్రశ్నించాడు. అయితే అక్కడి ఆఫీసర్లు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో తన డెత్​ ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ వివరాలు ఇవ్వాలంటూ ఆర్టీఐ(సమాచార హక్కు చట్టం)కి అప్లై చేశాడు. తాను బతికుండగానే చంపేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను కోరాడు.