హైదరాబాద్, వెలుగు : పీఎఫ్ఐ కార్యకలాపాలతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అలర్ట్ అయ్యింది. తమిళనాడు, కేరళలో జరిగినట్లు ఆర్ఎస్ఎస్, హిందూ కార్యకర్తలపై దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్లు గుర్తించింది. దీంతో పోలీసులను ఇంటెలిజెన్స్ అప్రమత్తం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా సీపీలు, ఎస్పీలకు శుక్రవారం రాత్రి మెసేజ్ పంపింది. పీఎఫ్ఐ కార్యకర్తలు, అనుమానితులపై నిఘా పెంచాలని సూచించింది.
ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు, హిందూ ధార్మిక సంస్థల వద్ద బందోబస్తు పటిష్టం చేయాలని ఆదేశించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఐబీ హెచ్చరికలతో రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. పీఎఫ్ఐ ఆఫీసులు, కార్యకర్తల వివరాలు సేకరిస్తున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కేస్ రికార్డ్స్ ఆధారంగా అనుమానితుల కదలికలపై నిఘా వేశారు. స్థానిక స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో డేటా కలెక్ట్ చేస్తున్నారు.