6 జిల్లాల్లో 45 డిగ్రీలు.. తెలంగాణ వ్యాప్తంగా మరింత పెరిగిన టెంపరేచర్లు

6 జిల్లాల్లో 45 డిగ్రీలు.. తెలంగాణ వ్యాప్తంగా మరింత పెరిగిన టెంపరేచర్లు
  • అత్యధికంగా నల్గొండ, మంచిర్యాలో 45.2 డిగ్రీలు​
  • ములుగు, వరంగల్​, వనపర్తి, జగిత్యాలలో 45 పైనే
  • రాష్ట్రమంతటా వడగాలుల ఎఫెక్ట్, మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి
  • అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్​ అలర్ట్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరిగింది. ఈ ఎండాకాలంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్క్​ను దాటాయి. గురువారం 6 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి, మంచిర్యాల జిల్లా హాజీపూర్​లో అత్యధికంగా 45.2 డిగ్రీల టెంపరేచర్​ రికార్డయింది. ములుగు జిల్లా కాశీందేవ్​పేట, వరంగల్​ జిల్లా గొర్రెకుంట, వనపర్తి జిల్లా వెల్గొండలో 45.1, జగిత్యాల జిల్లా వెల్గటూరులో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

ములుగు, జయశంకర్​ భూపాలపల్లి, భద్రాద్రి, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, సూర్యాపేట జిల్లాల్లోని ఎండల తీవ్రత పెరిగింది. రాష్ట్రమంతటా వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది.

మరో 16 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైనే..

నాలుగు జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా 43 నుంచి 45 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు రికార్డ్​ అయ్యాయి. 6 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదైతే.. మరో 16 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా రికార్డయ్యాయి. ఇంకో 6 జిల్లాల్లో 43 డిగ్రీలు దాటాయి. ఐదు జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు నమోదయ్యాయి. ఖమ్మం, మహబూబాబాద్, జయశంకర్​ భూపాలపల్లి, పెద్దపల్లి, నిర్మల్​ జిల్లాల్లో 44.9, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, కరీంనగర్​ జిల్లాల్లో 44.8, సూర్యాపేట జిల్లాలో 44.7, జనగామ, కుమ్రంభీం ఆసిఫాబాద్​, నిజామాబాద్​ జిల్లాల్లో 44.6, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 44.5, నారాయణపేటలో 44.4, జోగులాంబ గద్వాల జిల్లాలో 44.3, హనుమకొండ జిల్లాలో 44.2, మహబూబ్​నగర్​ 43.9, నాగర్​కర్నూల్​, ఆదిలాబాద్​లో 43.8, యాదాద్రి భువనగిరి 43.4, కామారెడ్డి 43.1, మేడ్చల్​ మల్కాజిగిరి 43, రంగారెడ్డి 42.8, మెదక్​ 42.6, హైదరాబాద్​ 42.5, సంగారెడ్డి 42.4, వికారాబాద్​ 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

ఇంకో రెండ్రోజులు వడగాలులు..

రాష్ట్రంలో మరో రెండ్రోజులు ఉష్ణోగ్రతలు ఇదే రేంజ్​లో ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. వడగాలులు తీవ్రంగా ఉంటాయంది. రాష్ట్రం మొత్తానికి ఆరెంజ్​ అలర్ట్​ను జారీ చేసింది. వచ్చే ఆదివారం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని చెప్పింది.