- అత్యధికంగా నల్గొండ, మంచిర్యాలో 45.2 డిగ్రీలు
- ములుగు, వరంగల్, వనపర్తి, జగిత్యాలలో 45 పైనే
- రాష్ట్రమంతటా వడగాలుల ఎఫెక్ట్, మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి
- అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరిగింది. ఈ ఎండాకాలంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్క్ను దాటాయి. గురువారం 6 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి, మంచిర్యాల జిల్లా హాజీపూర్లో అత్యధికంగా 45.2 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. ములుగు జిల్లా కాశీందేవ్పేట, వరంగల్ జిల్లా గొర్రెకుంట, వనపర్తి జిల్లా వెల్గొండలో 45.1, జగిత్యాల జిల్లా వెల్గటూరులో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, సూర్యాపేట జిల్లాల్లోని ఎండల తీవ్రత పెరిగింది. రాష్ట్రమంతటా వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది.
మరో 16 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైనే..
నాలుగు జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా 43 నుంచి 45 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. 6 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదైతే.. మరో 16 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా రికార్డయ్యాయి. ఇంకో 6 జిల్లాల్లో 43 డిగ్రీలు దాటాయి. ఐదు జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు నమోదయ్యాయి. ఖమ్మం, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, నిర్మల్ జిల్లాల్లో 44.9, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో 44.8, సూర్యాపేట జిల్లాలో 44.7, జనగామ, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 44.6, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 44.5, నారాయణపేటలో 44.4, జోగులాంబ గద్వాల జిల్లాలో 44.3, హనుమకొండ జిల్లాలో 44.2, మహబూబ్నగర్ 43.9, నాగర్కర్నూల్, ఆదిలాబాద్లో 43.8, యాదాద్రి భువనగిరి 43.4, కామారెడ్డి 43.1, మేడ్చల్ మల్కాజిగిరి 43, రంగారెడ్డి 42.8, మెదక్ 42.6, హైదరాబాద్ 42.5, సంగారెడ్డి 42.4, వికారాబాద్ 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇంకో రెండ్రోజులు వడగాలులు..
రాష్ట్రంలో మరో రెండ్రోజులు ఉష్ణోగ్రతలు ఇదే రేంజ్లో ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. వడగాలులు తీవ్రంగా ఉంటాయంది. రాష్ట్రం మొత్తానికి ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. వచ్చే ఆదివారం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని చెప్పింది.