
హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ స్టూ డెంట్లకు గురువారం నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 వరకు జరిగే ప్రాక్టికల్స్.. మూడు సెషన్లలో నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. మొత్తం 3,87,893 మంది స్టూడెంట్లు అటెండ్ అవుతారని తెలిపారు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,032 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా మార్నింగ్ సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఆఫ్టర్నూన్ సెషన్లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
మొదటి విడతలో ఈ నెల 1 నుంచి 5 దాకా, రెండో విడతలో 6 నుంచి 10 దాకా, మూడో విడతలో 11 నుంచి 15వ తేదీ దాకా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నట్టు వివరించారు. ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణలో సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని బోర్డు ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రద బాయి హెచ్చరించారు. గతంలో కొందరు ఎగ్జామినర్లు కాలేజీల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తే వారిని సస్పెండ్ చేశామని గుర్తుచేశారు.