హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల ఆన్సర్ షీట్ల వాల్యువేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే నెల 10వ తేదీ వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. ఏప్రిల్ చివరి వారంలో ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మొత్తంగా సుమారు 60 లక్షల ఆన్సర్ షీట్లను వాల్యుయేషన్ చేసేందుకు 16 వాల్యుయేషన్ సెంటర్లను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఈనెల 16న మొదటి విడత ప్రారంభం కాగా 24న ఫోర్త్ స్పెల్ మొదలైంది.
ఈ క్రమంలో ఫస్ట్ స్పెల్ లో ప్రారంభమైన తెలుగు, హిందీ, పొలిటికల్ సైన్స్ తదితర సబ్జెక్టుల వాల్యుయేషన్ ప్రక్రియ ముగిసింది. మిగిలిన సబ్జెక్టుల ప్రక్రియ కొనసాగుతోంది. మూల్యాంకన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. లోక్ సభ ఎన్నికల, ఎలెక్షన్ ట్రైనింగ్ నేపథ్యంలో లెక్చరర్లు ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంతో కొంత ఆలస్యమైనా, ఏప్రిల్10 లోపే వాల్యుయేషన్ పూర్తి చేసేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. కాగా, జూన్ లో అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.