హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాక్సిన్పై దేశవ్యాప్తంగా జనాల్లో ఇంట్రస్ట్ పెరుగుతోంది. మొదట్లో వద్దన్న వాళ్లూ ముందుకొస్తున్నారు. ఏప్రిల్ నుంచి మే వరకు 2 నెలల్లోనే వ్యాక్సిన్ వేయించుకోవడానికి రెడీ అయిన వాళ్లు 4 రెట్లు పెరిగారు. దీంతో వ్యాక్సిన్ దొరకని పరిస్థితి ఏర్పడింది. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ చేసిన ఆన్లైన్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశంలోని 229 జిల్లాల్లోని 26 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో 64 శాతం మంది పురుషులు, 36 శాతం మంది మహిళలు ఉన్నారు.
వ్యాక్సిన్ అపాయింట్మెంట్ కష్టమవుతోంది
వ్యాక్సిన్ కోసం కొవిన్, ఆరోగ్యసేతులో అంత ఈజీగా అపాయింట్మెంట్ దొరకడం లేదని కూడా స్పష్టమైంది. కొవిన్, ఆరోగ్యసేతుల్లో రిజిస్ట్రేషన్, అపాయింట్మెంట్ ఈజీగానే దొరికిందని 21 శాతం మందే చెప్పారు. చాలా సార్లు ఓపెన్ చేస్తేనే అపాయింట్మెంట్ దొరికిందని 6 శాతం మంది, రిజిస్టర్ అయినా అపాయింట్మెంట్ దొరకట్లేదని 44 శాతం మంది.. ఓటీపీ, ఇతర కారణాలతో రిజిస్టర్ కావట్లేదని 9 శాతం మంది తెలిపారు. మొత్తంగా వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ దొరకలేదని 73 శాతం మంది చెప్పినట్టు సర్వేలో తేలింది.
వ్యాక్సిన్కు 82% మంది ఓకే
కరోనా సెకండ్ వేవ్కు ముందు వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలా మంది ఇంట్రస్ట్ చూపించలేదు. లోకల్ సర్కిల్స్ సంస్థ జనవరి 18 వరకు చేసిన సర్వేలో 62 శాతం మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి వెనకడుగు వేశారు. ఫిబ్రవరి 3న మరో సర్వే చేస్తే అది 58శాతానికి తగ్గింది. వ్యాక్సిన్ వేసుకోవడం, సైడ్ ఎఫెక్ట్స్, ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో తాజాగా చాలా మంది టీకాలు వేసుకోవడానికి ముందుకొస్తున్నారు. దీంతో ప్రస్తుతం 18 శాతం మందే వ్యాక్సిన్పై సంకోచిస్తున్నారు. మొత్తంగా ఫిబ్రవరిలో 42 శాతం మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి సుముఖంగా ఉండగా మే ఆఖరికి అది 82 శాతానికి పెరిగింది.