
హైదరాబాద్, వెలుగు: హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ ఎక్మో సొసైటీ ఆఫ్ ఇండియాతో కలసి “ఎక్మో” పై 13వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్, లైవ్ వర్క్ షాప్ నిర్వహించింది. ఎక్స్ ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఎక్మో - ) తీవ్రంగా దెబ్బతిన్న ఊపిరితిత్తులు, గుండెకు అత్యంత అధునాతనమైన లైఫ్ సేవింగ్ సపోర్ట్ సిస్టమ్ను అందిస్తుంది. ఈ 13వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్, లైవ్ వర్క్ షాప్ లో 20 మందికి పైగా ప్రపంచంలోని అత్యుత్తమ అంతర్జాతీయ అధ్యాపకులు, 100 మందికి పైగా జాతీయ అధ్యాపకులు.. భారతదేశం నలుమూల నుంచి 1000 మందికి పైగా పాల్గొన్న ఎక్మో డాక్టర్లకు, క్రిటికల్ కేర్ ఎక్స్పర్టులకు ట్రైనింగ్ ఇచ్చారు. గత దశాబ్ద కాలంలో భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఎక్మో సమావేశాలలో ఇది ఒకటి. అడల్ట్, పీడియాట్రిక్ డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్, పెర్ఫ్యూనిస్ట్ నర్సింగ్, రెస్పిరేటరీ థెరపిస్ట్లు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. దాదాపు నలభై సంవత్సరాల క్రితమే ఎక్మోకు రూపకల్పన జరిగినా అప్పట్లో దీని వాడకం చాలా తక్కువగా ఉండేదన్నారు. ఇప్పుడు ఎక్మో పరికరం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సమయాల్లో, గుండె, ఊపిరితిత్తులు పనిచేయని సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. భారతదేశంలో కరోనా తర్వాత ఎక్మో అవసరం ఎక్కువగా పెరిగిపోయిందని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది పేషెంట్లను ‘ఎక్మో’ సహాయంతో కాపాడిన ఆసుపత్రుల్లో యశోద హాస్పిటల్ ఒకటని పవన్ వివరించారు. ఎక్మో మద్దతు ద్వారా ఊపిరితిత్తుల మార్పిడితో ప్రాణాలను కాపాడేందుకు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వందకుపైగా ఎయిర్ అంబులెన్స్లు యశోద హాస్పిటల్స్కు వచ్చాయని ఆయన అన్నారు.