రాజస్థాన్ నుంచి వచ్చి హైదరాబాద్‎లో చోరీ.. అంతర్రాష్ట్ర షట్టర్ లిఫ్టింగ్ ముఠా అరెస్ట్

రాజస్థాన్ నుంచి వచ్చి హైదరాబాద్‎లో చోరీ.. అంతర్రాష్ట్ర షట్టర్ లిఫ్టింగ్ ముఠా అరెస్ట్

అంబర్ పేట్, వెలుగు: అంతర్రాష్ట్ర షట్టర్ లిఫ్టింగ్ ముఠాను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ ఆఫీసులో  ఏసీపీ మట్టయ్య తెలిపిన వివరాల ప్రకారం..  హైదరాబాద్‌ సుల్తాన్ బజార్‌లో లక్ష్మీ మొబైల్ షాపు యజమాని మసర రామ్ దేవసి ఎప్పటిలాగే ఈ నెల 4న ఉదయం షాపు తెరవడానికి వెళ్లాడు. షాపు షట్టర్ పగలగొట్టి ఉండటం, క్యాష్ కౌంటర్‎లో ఉండాల్సిన రూ. 9 లక్షల నగదు దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు రాజస్థాన్‏కు చెందిన వారని గుర్తించారు.  

ముఠా ప్రధాన నిందితుడు పరసరామ్, గతంలో అదే గల్లీలో పనిచేసిన అనుభవంతో షాపులో నగదు ఉంటుందని గుర్తించాడు.  తన మిత్రుడు జైసా రామ్‌ సహాయంతో ముఠా ఏర్పాటు చేశాడు. -నాగాజీ రామ్, లీలారామ్, లక్ష్మణ్ రామ్, జబరా రామ్‌లను  రైలులో హైదరాబాద్ రప్పించాడు.  దిల్ సుఖ్ నగర్‎లో లాడ్జిలో ఉన్న వీరు ఈ నెల 3న రాత్రి మొబైల్ షాపులో దొంగతనానికి పాల్పడ్డారు.  గతంలో  వీరు కోఠిలోని వివిధ మొబైల్ షాపుల్లో పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలోని ఆరుగురిని పట్టుకొని వారి నుంచి రూ.8 లక్షల నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.  సమావేశంలో డీసీపీ బాలస్వామి, ఇన్ స్పెక్టర్ నర్సింహులు ఉన్నారు.