మణుగూరులో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

మణుగూరులో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

మణుగూరు, వెలుగు : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు బంగారం దుకాణాల్లో చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగను మణుగూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మణుగూరు డీఎస్పీ వి.రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...  ఈనెల 23న మణుగూరులోని శ్రీవారి జువెలర్స్ షాప్ లో పనిచేస్తున్న మహిళను ఓ వ్యక్తి మాటల్లో పెట్టి 132 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. బాధితుడు దేవత శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

మంగళవారం ఎస్సై మేడ ప్రసాద్ తన సిబ్బందితో మణుగూరు హనుమాన్ టెంపుల్ వద్ద వాహన తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి పోలీసులు చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని ఛేజ్​ చేసి పట్టుకొని విచారించగా ఏపీలోని భీమవరం జిల్లా ఆకివీడు గ్రామానికి చెందిన గొర్రెల సత్యనారాయణగా తేలింది. మణగూరులోని శ్రీవారి జ్యువెలర్స్ షాప్ లో ఆభరణాలు చోరీ చేసింది తానేనని ఒప్పుకున్నాడన్నారు.

.అతడి వద్ద నుంచి 132 గ్రాముల 6 బంగారం చైన్లు, ఒక నల్లపూసల గొలుసు, 5 బేబీ రింగ్స్ తోపాటు వరంగల్ జిల్లా సాయి గణేశ్​జువెలరీ షాప్ లో దొంగిలించిన 20 జతల చెవి కమ్మలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 35 చోట్ల చోరీ కేసులు నమోదైనట్లు డీఎస్పీ తెలిపాడు. నిందితుడిని అరెస్టు చేసి మణుగూరు కోర్టులో ప్రవేశపెట్టామన్ని చెప్పారు. నాలుగు రోజుల్లో కేసును ఛేదించిన ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, మణుగూరు ఎస్సై ప్రసాద్, సీసీఎస్ ఎస్సై రామారావు, కానిస్టేబుళ్లు రామారావు, బాలు, వెంకటనారాయణ, విజయ్ ను డీఎస్పీ అభినందించారు.