
- కాళేశ్వరం కమిషన్ ముందుకు రానున్న కేసీఆర్, హరీశ్
- ఫార్ములా ఈ కేసులో కేటీఆర్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును విచారించనున్న దర్యాప్తు సంస్థలు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై దర్యాప్తు సంస్థల ఎంక్వైరీలు స్పీడ్ అందుకున్నాయి. ఏడాదిన్నరగా కొనసాగుతున్న విచారణలు తుది దశకు చేరుకున్నాయి. దీంతో వరుసగా ముఖ్య నేతల ఎంక్వైరీలు జరుగుతున్నాయి. కాళేశ్వరం కమిషన్ విచారణకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం హాజరుకాగా.. ఈ నెల 9, 11 తేదీల్లో హరీశ్రావు, కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. అయితే కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక ఫార్ములా–ఈ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడైన కేటీఆర్ను మరోసారి విచారించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఆయనకు గత నెల 28నే నోటీసులు జారీ చేశారు. కానీ బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల కోసం బ్రిటన్, అమెరికా టూర్లకు వెళ్లాల్సి ఉన్నందున విచారణకు రాలేనని ఏసీబీకి కేటీఆర్ సమాచారం అందించారు. అయితే విదేశీ పర్యటనలు ముగించుకుని కేటీఆర్ గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో ఆయన త్వరలోనే ఏసీబీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.
సిట్ ముందుకు ప్రభాకర్ రావు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు కూడా సిట్ ముందు విచారణకు హాజరుకానున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే వన్ టైమ్ ఎంట్రీ ఎమర్జెన్సీ సర్టిఫికెట్పై ఇండియాకు వచ్చేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు సోమ లేదంటే బుధ, గురువారాల్లో ప్రభాకర్ రావు విచారణకు రానున్నారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ప్రభాకర్రావును స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించడానికి గల కారణాలను సిట్ అధికారులు రాబట్టనున్నారు. ఇప్పటివరకు విచారణలో పాల్గొన్న పోలీస్అధికారులంతా తాము ప్రభాకర్రావు చెప్పినట్లే చేశామని, ఆయన ఎవరి ఫోన్లను ట్యాప్చేయమంటే వారి ఫోన్లను ట్యాప్ చేశామని చెప్పారు. దీంతో అసలు ప్రభాకర్రావు ఎవరి ఆదేశాల మేరకు ఆయా ఫోన్లను ట్యాప్చేయించారు? ఆయన ఎవరి పేరు చెప్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.
జీఎస్టీ స్కామ్లో సోమేశ్..
రూ.1,400 కోట్ల జీఎస్టీ స్కామ్పై సీఐడీ దర్యాప్తు ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్నది. ఈ కేసులో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ నుంచి ఇప్పటికే సీఐడీ అధికారులు వివరాలు సేకరించారు. కమిషనర్ శ్రీదేవి కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు సోమేశ్ కుమార్ నుంచి మరింత సమాచారం సేకరించాల్సిన అవసరం ఉందని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు మరో రెండు, మూడు రోజుల్లో సోమేశ్ కుమార్కు నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది.