- మెడికల్ డివైజెస్ పార్క్లో రూ.250 కోట్ల పెట్టుబడి
- ముందుకు వచ్చిన ఎస్3వీ వాస్కులర్ టెక్నాలజీస్
- మంత్రి కేటీఆర్తో భేటీ అయిన సంస్థ ప్రతినిధులు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మెడికల్ డివైజెస్ పార్క్లో రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎస్3వీ వాస్కులర్ టెక్నాలజీస్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ సంస్థ హైఎండ్ న్యూరో -కార్డియక్ మెడికల్ డివైజెస్ను తయారు చేయనుంది. దీని ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా, 250 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఎస్3వీ ప్రమోటర్, డైరెక్టర్లు బద్రీనారాయణ, డాక్టర్ విజయగోపాల్ గురువారం మంత్రి కేటీఆర్ను ఆయన ఆఫీస్లో కలిసి పెట్టుబడులపై చర్చించారు. మెడికల్ డివైజెస్ పార్క్లో ఇప్పటి వరకు రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయని, వీటి ద్వారా 7 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. రీసెర్చ్, డెవలప్మెంట్, ఇన్నోవేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం సహాకారం అందిస్తదని చెప్పారు. ప్రపంచంలోనే నికేల్, కోబల్ట్ అలర్జెనిక్ అయాన్స్ లేకుండా డ్రగ్ ఎలూటింగ్ స్టంట్లను తయారు చేసిన మొదటి సంస్థ తమదేనని ఎస్3వీ ప్రమోటర్ బద్రినారాయణ తెలిపారు. తమ సంస్థ తక్కువ ధరలో హెల్త్కు తక్కువ హాని చేసే వైద్య పరికరాలను రూపొందిస్తుందని చెప్పారు. హెల్త్ కేర్ సెక్టార్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుబాటులోకి తీసుకొస్తున్న ఈకో సిస్టంతో సామాన్యులపై వైద్య ఉపకరణాల కొనుగోలు భారం తగ్గుతుందన్నారు.