
ఐపీఎల్18 క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. అహ్మదాబాద్లోని వరల్డ్ లార్జెస్ట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ ఫైట్తో మెగా లీగ్కు అదిరిపోయే ముగింపు లభించింది. క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కప్పు నెగ్గి తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకోగా, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఆఖరి మెట్టుపై తడబడింది. బలమైన ఇండియన్స్ మరోసారి అబ్బురపరిచినా చివరికి చతికిలపడగా, శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ కీలక సమయాల్లో చేతులెత్తేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇండియా– -పాకిస్తాన్ ఉద్రిక్తతలతో వారం పైచిలుకు గ్యాప్ వచ్చినా మెగా లీగ్ మజా ఏమాత్రం తగ్గలేదు. మొత్తంగా 18వ సీజన్లోని 74 మ్యాచ్లు ఎన్నో మలుపులు తిరుగుతూ ఆర్సీబీకి చిరస్మరణీయ విజయాన్ని అందించింది. మిగిలిన తొమ్మిది జట్లకు19వ ఎడిషన్ కోసం పాఠాలు నేర్పింది. మార్చిలో మొదలై జూన్లో ముగిసిన 18వ సీజన్ ఎలా సాగిందో ఓ లుక్కేద్దాం.
బెంగ తీరిన వేళ.. కింగ్ కంట కన్నీరు..
ఈ సీజన్లో నిలకడగా ఆడిన విరాట్ కోహ్లీ మెగా ఫైనల్లో పెద్దగా రాణించలేకపోయాడు. ఆచితూచి ఆడిన అతను 35 బాల్స్లో 3 ఫోర్లతో 43 రన్స్ మాత్రమే చేయడం మొదట్లో ఆర్సీబీని కొంత నిరాశపరిచింది. భారీ స్కోర్లు నమోదవుతున్న పిచ్పై మరే ఆటగాడూ దంచికొట్టకపోవడంతో ఆర్సీబీని మరోసారి దురదృష్టం వెంటాడేలా కనిపించింది. మధ్యలో పంజాబ్ ఆధిక్యంలో ఉన్నట్లు కనిపించినా, చివరికి అంతా ఆర్సీబీకి అనుకూలంగా మారింది. మెగా వేలంలో పటిష్టమైన జట్టును నిర్మించుకున్న చాలెంజర్స్ ఈ ఏడాది సమష్టిగా రాణించి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఎప్పుడూ ఫుల్ జోష్తో కనిపించే విరాట్ విజయం ఖాయమైన వేళ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలు అభిమానుల గుండెల్లో చిరకాలం గుర్తుండిపోతాయి. భవిష్యత్తులో కోహ్లీలా బ్యాటింగ్ చేసి అతనిలా ఒకే ఫ్రాంచైజీకి ఎక్కువ కాలం ఆడిన ఆటగాడు వచ్చేవరకు ఐపీఎల్లో ఒకే టీమ్ తరఫున అత్యధిక రన్స్ రికార్డు కోహ్లీ (9,085) పేరు మీదే ఉంటుంది. ఇందులో ఈ సీజన్తో కలిపి ఐదుసార్లు 600 రన్స్ మార్కును అందుకున్నాడు.
పంజాబ్ కింగ్స్ ప్రతాపం
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్పై అంచనాలు తక్కువ. పాయింట్ల పట్టికలో ఎప్పుడూ చివరివైపునే కనిపించే పంజాబ్ ఈసారి ప్లేఆఫ్స్కు వస్తుందని కూడా ముందుగా ఎవ్వరూ ఊహించలేదు. కానీ, గతేడాది కేకేఆర్కు కప్పు అందించిన శ్రేయస్ అయ్యర్ ఆ టీమ్ను ఫైనల్ చేర్చి ఔరా అనిపించాడు. కొన్నాళ్లుగా బ్యాటర్గా సూపర్ ఫామ్లో ఉన్న అయ్యర్.. లీడర్గా జట్టును ముందుండి నడిపించాడు. ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ కోచింగ్లో జట్టు రాతనే మార్చేశానడంలో సందేహం లేదు. పెద్దగా పేరు లేని కుర్రాళ్ల నుంచి ఈ ఇద్దరూ అద్భుతమైన ఆటను రాబట్టారు. ఈసారి ట్రోఫీ గెలవకపోయినప్పటికీ ఐపీఎల్లో ఇకపై తమను టైటిల్ పోటీదారులలో పరిగణించేలా పంజాబ్ చేసింది. ఈ క్రెడిట్ అంతా అయ్యర్, పాంటింగ్దే.
ముంబై మళ్ళీ అదే తీరు
2021లో ఐదో ప్లేస్.. 2022లో 10వ స్థానం. 2023లో నాలుగో స్థానం.. గతేడాది మళ్లీ పదో ప్లేస్. ఈ సీజన్కు వచ్చేసరికి పాయింట్ల పట్టికలో 4వ స్థానం. గత ఐదేండ్ల నుంచి ముంబై ఇండియన్స్ తీరిది. 2020లో ఐదో టైటిల్ గెలిచినప్పటి నుంచి ముంబై మెగా లీగ్ ఆరంభంలో తడబడుతోంది. తొలి ఐదు మ్యాచ్ల్లో నాలుగుసార్లు ఓడి ఈసారి కూడా స్టార్టింగ్ ట్రబుల్ చూపెట్టిన హార్దిక్ పాండ్యా సేన ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచి గర్జించింది. సూర్యకుమార్ యాదవ్ (717 రన్స్) ముంబై తరఫున 700 ప్లస్ రన్స్ చేసిన తొలి ప్లేయర్గా నిలిచాడు.
బ్రేక్ తర్వాత టైటాన్స్ బ్రేకౌట్
సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జోస్ బట్లర్, ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా రాణించడంతో గుజరాత్ టైటాన్స్ లీగ్ దశలో ఆధిపత్యం చెలాయించినప్పటికీ టోర్నమెంట్ చివరి దశలో నీరసించింది. టాప్–2 ప్లేస్ లాంఛనంగా కనిపించినప్పటికీ చివరి రెండు లీగ్ మ్యాచ్ల్లో ఓడి మూడో స్థానంతో సరిపెట్టింది. ఎలిమినేటర్లో ముంబై చేతిలో ఘోర ఓటమితో ఈ సీజన్ను నిరాశగా ముగించింది. సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ నెగ్గి ఫ్యూచర్ టీమిండియా స్టార్ ప్లేయర్గా ఎదిగే సత్తా ఉందని నిరూపించుకోవడం ఒక్కటే టైటాన్స్కు ప్లస్ పాయింట్.
బ్యాట్తో భయపెట్టినా.. సన్ ‘రైజ్’ అవ్వలే
గత సీజన్ ఫైనలిస్ట్ సన్ రైజర్స్ అత్యంత బలమైన, భయానక బ్యాటింగ్ లైనప్తో బరిలోకి దిగినప్పటికీ ఈసారి ప్లే ఆఫ్స్ కూడా చేరలేకపోయింది. బ్యాటర్లపై అతిగా ఆధారపడటం, అతి దూకుడు చేటు చేసింది. ఆర్ఆర్పై 286/6 చేసి లీగ్లో రెండో అత్యధిక స్కోరుతో సీజన్ను ప్రారంభించిన సన్ రైజర్స్ కేకేఆర్పై 278/3తో మూడో అత్యధిక స్కోరు చేసి ఈ సీజన్ను ముగించింది. మధ్యలో చాలా తప్పిదాలు చేసిన రైజర్స్ వచ్చే సీజన్లో వాటిని సరిదిద్దుకోవాలి.
ఆ నాలుగు జట్లకు నిరాశే
ఐదుసార్లు విజేత సీఎస్కే, డిఫెండింగ్ చాంపియన్ కేకేఆర్, మాజీ విన్నర్ రాజస్తాన్ రాయల్స్తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కు ఈ సీజన్ నిరాశ కలిగించింది. సీజన్ ఆరంభంలోనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సేవలు కోల్పోయిన చైన్నైని ధోనీ సరిగ్గా నడిపించలేకపోయాడు. యువ ప్రతిభను బెంచ్కే పరిమితం చేసే తమ తత్వాన్ని సీఎస్కే పక్కన పెట్టినప్పటికీ అప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక, తమకు ట్రోఫీ అందించిన నాయకుడు శ్రేయస్ అయ్యర్ను వదులుకున్న కేకేఆర్ ఈసారి చాలా తప్పిదాలే చేసింది. కెప్టెన్ అజింక్యా రహానె ఒంటరి పోరాటం ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఫ్రాంచైజీలో అత్యంత ఖరీదైన ఆటగాడు, వైస్-కెప్టెన్ వెంకటేష్ అయ్యర్తో పాటు రస్సెల్, రింకూ సింగ్ వంటి ప్లేయర్ల ఫెయిల్యూర్ వల్ల లీగ్ దశలోనే నిష్ర్కమించాల్సి వచ్చింది. ఇక, కెప్టెన్ సంజూ శాంసన్ ఫిట్నెస్, ఫామ్పై ఆందోళన మధ్య ఇతర ప్లేయర్లు బాధ్యత తీసుకోవడంలో విఫలం అవ్వడంతో ఆర్ఆర్ చివరి నుంచి రెండో ప్లేస్తో లీగ్ను ముగించింది. బట్లర్, అశ్విన్, చహల్, ట్రెంట్ బౌల్ట్ వంటి కీలక ఆటగాళ్లను వదులుకోవడం ఆ జట్టు సమతుల్యాన్ని దెబ్బతీసింది.
లీగ్లో ఖరీదైన ప్లేయర్ ( రూ. 27 కోట్లు)గా రికార్డు సృష్టించిన కెప్టెన్ రిషబ్ పంత్ చెత్తాట లక్నో సూపర్ జెయింట్స్ను ముంచింది. తరచూ అతని బ్యాటింగ్ ఆర్డర్ను మార్చిన లక్నో మేనేజ్మెంట్ నిర్ణయాలు బెడిసికొట్టాయి. మిడిలార్డర్లో డెప్త్ లేకపోవడం, బౌలింగ్లో వైవిధ్యం కొరవడటంతో మరోసారి ప్లేఆఫ్స్కు దూరమైంది. అయితే మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, మార్క్రమ్, దిగ్వేశ్ రాఠీ వ్యక్తిగతంగా ఆకట్టుకున్నారు.
హై -ఫ్లయింగ్ డీసీ ఆఖర్లో డీలా
అక్షర్ పటేల్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలో ఒక్క అడుగు కూడా తప్పు వేయనట్లు కనిపించినప్పటికీ రెండో దశలో తడబడింది. మరింత నిలకడగా, మెరుగ్గా ఆడాల్సిన సమయంలో ఆ జట్టు పోరాటం సన్నగిల్లింది. తొలి ఆరు మ్యాచ్లలో ఐదు విజయాలతో డీసీ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది, కానీ ఆ తర్వాత ఎనిమిదింటిలో ఐదు ఓడిపోయి ఒక్కసారిగా పతనమై ఐదో ప్లేస్తో ప్లేఆఫ్స్కు దూరమైంది.
కుర్రాళ్లు కేక
ఎప్పట్లానే ఈ సీజన్లో కొత్త కుర్రాళ్లు తమ టాలెంట్తో కేక పుట్టించారు. అందులో ముందున్నోడు రాజస్తాన్ రాయల్స్ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ. గుజరాత్ టైటాన్స్పై కేవలం 35 బాల్స్లోనే సెంచరీ కొట్టిన 14 ఏండ్ల సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్గా ప్రకంపనలు సృష్టించాడు. సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో దుమ్మురేపగా.. పంజాబ్ కింగ్స్ అన్క్యాప్డ్ ప్లేయర్ ప్రియాన్ష్ ఆర్య కూ డా సెంచరీతో వెలుగులోకి వచ్చాడు. అదే టీమ్ బ్యాటర్ ప్రభ్సిమ్రన్ సింగ్ కూడా సత్తా చాటగా, 17 ఏండ్ల ఆయుష్ మాత్రే ఈసారి చెత్తగా ఆడినా సీఎస్కేకు కొన్ని సంతోషకర క్షణాలు అందించాడు.