
- ఇజ్రాయెల్ దాడులతో మార్కెట్లు కుదేల్..
- సెన్సెక్స్ 573 పాయింట్లు డౌన్.. 169 పాయింట్లు తగ్గిన నిఫ్టీ
ముంబై: ఇజ్రాయెల్, ఇరాన్ రాజధానిపై దాడి చేసిన తర్వాత ప్రపంచ మార్కెట్లు బలహీనపడటం, బ్రెంట్ ముడి చమురు ధరలు పెరగడంతో శుక్రవారం ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు ఒకశాతం పడిపోయాయి. వరుసగా రెండో రోజు కూడా సెన్సెక్స్పడింది. ఇది 573.38 పాయింట్లు క్షీణించి 81,118.60 వద్ద స్థిరపడింది. ఉదయం ట్రేడింగ్ సమయంలో1,337.39 పాయింట్లు తగ్గి 80,354.59 వద్ద ముగిసింది.
బీఎస్ఈలో 2,469 స్టాక్లు క్షీణించగా, 1,516 లాభాలతో ముగిశాయి. 50 షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 169.60 పాయింట్లు పడి 24,718.60 వద్ద ముగిసింది. వారంవారీగా చూస్తే, బీఎస్ఈ బెంచ్మార్క్ 1,070.39 పాయింట్లు (1.30 శాతం), నిఫ్టీ 284.45 పాయింట్లు (1.13 శాతం) క్షీణించింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం వస్తుందనే భయాలకుతోడు, విదేశీ నిధులు వెళ్లిపోవడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్బలహీనపడింది. "ఇజ్రాయెల్ కీలకమైన ఇరానియన్ ప్రాంతాలపై దాడి చేసిన తర్వాత మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను బంగారం వంటి సురక్షిత ఆస్తుల వైపు నడిపించాయి.
ఈక్విటీలు దెబ్బతింటుండటం ఇందుకు కారణం. రాబోయే కొన్ని వారాల్లో అమెరికా ఏకపక్ష సుంకాలు విధించే అవకాశం ఉందనే ఆందోళనలు, దేశీయ ఈక్విటీల ఓవర్ వాల్యుయేషన్లు, మార్కెట్ల కన్సాలిడేషన్కు దారితీశాయి" అని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ వీపీ (పరిశోధన) ప్రశాంత్ తాప్సే అన్నారు.
సెన్సెక్స్ కంపెనీలలో, అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోయాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, సన్ ఫార్మా, మారుతి లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ గేజ్ 0.32 శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.30 శాతం తగ్గాయి. రెండు రోజుల మార్కెట్ క్షీణత వల్ల పెట్టుబడిదారుల సంపద రూ. 8.35 లక్షల కోట్లు తగ్గింది.
సెక్టోరల్ ఇండెక్స్లకూ నష్టాలే..
బీఎస్ఈ సెక్టోరల్ ఇండెక్స్లలో సేవలు (2.06 శాతం), బ్యాంకెక్స్ (1.01 శాతం), ఎఫ్ఎంసీజీ (0.94 శాతం), ఫైనాన్షియల్ సర్వీసెస్ (0.85 శాతం), మెటల్ (0.81 శాతం) పవర్ (0.75 శాతం) పడిపోయాయి. హెల్త్కేర్, రియాల్టీ మాత్రమే లాభపడ్డాయి. "గ్లోబల్ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, ఎఫ్ఐఐలు నిధులను వెనక్కి తీసుకోవడంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
ఇరాన్పై ఇజ్రాయెల్ సైనిక దాడి తర్వాత పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బకొట్టాయి. ఇది పెట్టుబడిదారులలో రిస్క్ విముఖతను బాగా పెంచింది. బ్రెంట్ ముడి చమురు ధరలు బ్యారెల్కు 74 డాలర్లకు చేరుకున్నాయి. ఇది ఈ సంవత్సరంలోనే అత్యధికం. ఇలానే ఉద్రిక్తతలు కొనసాగితే ఇండియాలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది" అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ పరిశోధనా విభాగాధిపతి వినోద్ నాయర్ అన్నారు.
గ్లోబల్ చమురు బెంచ్మార్క్ బ్రెంట్ ముడి చమురు 7.44 శాతం పెరిగి బ్యారెల్కు 74.52కి చేరుకుంది. ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ హాంగ్ సెంగ్ నష్టపోయాయి. యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యూఎస్ మార్కెట్లు గురువారం సానుకూలంగా ముగిశాయి. ఎఫ్ఐఐలు గురువారం రూ.3,831.42 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు.