టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు అంతే స్థాయిలో ఇరాన్ ప్రతి దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా మిత్ర దేశమైన ఒమన్పై తాజాగా ఇరాన్ అటాక్ చేసింది. ఒమన్లోని సలాలా ఓడరేవు లక్ష్యంగా డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. పోర్టులోని చమురు నిల్వ ట్యాంకులను ఇరాన్ డ్రోన్లు ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి.
దట్టమైన పొగ అలుముకుంది. ఈ దాడులను ఒమన్ టీవీ, బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ ధృవీకరించాయి. అయితే.. ఈ దాడిలో వ్యాపార నౌకలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. ఇరాన్ డ్రోన్లు పోర్టుపై దాడి చేయడం, ఆ వెంటనే ఆకాశనంటేలా మంటలు చెలరేగిన దృశ్యాలు ఆన్ లైన్లో వైరల్గా మారాయి.
ఒమన్ సుల్తాన్ సీరియస్:
సలాలా ఓడరేవుపై ఇరాన్ దాడులను ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ అల్ సైద్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడులు జరిగిన వెంటనే ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ను సంప్రదించి ఒమన్ భూభాగంలో జరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళనలను తెలియజేశారు. మిడిల్ ఈస్ట్ వార్లో ఒమన్ తటస్థ వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు.
ఒమన్ సార్వభౌమాధికారం, భద్రత, స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన ప్రతి చర్య తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అయతొల్లా ఖమేనీ వారసుడిగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయినందుకు మోజ్తాబా ఖమేనీని ఒమన్ సుల్తాన్ అభినందించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరిగాయని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది.
