ఇరాన్ చేతికి ఇజ్రాయెల్ ​షిప్

ఇరాన్ చేతికి ఇజ్రాయెల్ ​షిప్
  •     తీవ్ర పరిణామాలు తప్పవంటూ ఇజ్రాయెల్ హెచ్చరిక
  •     ఇరు దేశాల మధ్య టెన్షన్
  •     ఇజ్రాయెల్​కు అమెరికా వార్​ షిప్స్​

జెరూసలెం: పశ్చిమాసియా దేశాలలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్​పై ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్  తాజాగా శనివారం ఆ దేశ నౌకను సీజ్ చేసింది. గల్ఫ్ తీరంలో హార్మజ్ జలసంధి వద్ద ఈ నౌకను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తమ కంట్రోల్​ లోకి తీసుకున్నారు. అనంతరం షిప్​ ను ఇరాన్ జలాల్లోకి మళ్లించారు. సముద్రంపై ప్రత్యేకంగా హెలిక్యాప్టర్లతో ఆపరేషన్ నిర్వహించి ఈ షిప్ ను స్వాధీనం చేసుకున్నారని ఐఆర్ఎన్​ఏ ఏజెన్సీ వెల్లడించింది. ఈ విషయం తెలిసి ఇరాన్​పై ఇజ్రాయెల్​ మండిపడింది. దీంతో ఇరు దేశాల మధ్య టెన్షన్లు పెరుగుతాయని, తమ షిప్ ను సీజ్ చేసినందుకు ఫలితం అనుభవించాల్సి ఉంటుందని టెహ్రాన్​ను హెచ్చరించింది.

డమాస్కస్​లో దాడితో మొదలు..

సిరియా రాజధాని డమాస్కస్​లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఈ నెల మొదట్లో ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇందులో ఇరాన్ ఉన్నతాధికారులు ఇద్దరు, మరో ముగ్గురు సిబ్బంది చనిపోయారు. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఇజ్రాయెల్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీకార దాడి చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే గల్ఫ్ తీరంలో ఎంఎస్ సీ ఆరైస్ అనే ఇజ్రాయెల్ నౌకను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. హెలికాఫ్టర్​తో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి నౌకలో ల్యాండయ్యారు. ఆపై నౌకను తమ దేశంవైపు మళ్లించారు.

ఇజ్రాయెల్​కు మేమున్నం..

ప్రతిదాడికి ఇరాన్ ఏర్పాట్లు చేస్తోందని, ఏ క్షణంలోనైనా మిసైళ్ల వర్షం కురిపించే అవకాశం ఉందని అమెరికా శుక్రవారం ఓ రిపోర్టు విడుదల చేసింది. నౌకా విధ్వంసక క్షిపణులు, అదనపు సైనిక సామగ్రిని పశ్చిమాసియాకు తరలించారు. తూర్పు మధ్యధరా సముద్రంలోకి రెండు నేవీ డిస్ట్రాయర్లను  చేరవేశారు. ఇదిలా ఉండగా, తమ మధ్య తలదూర్చొద్దని అగ్రరాజ్యాన్ని ఇరాన్​ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో.. ఇజ్రాయెల్‌‌- హమాస్‌‌ల వరకు పరిమితమైన ప్రస్తుత యుద్ధం.. మొత్తం పశ్చిమాసియాకు విస్తరించే అవకాశం ఉందనే ఆందోళన నెలకొన్నది. ఈ యుద్ధం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపడంతోపాటు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

ఫ్లైట్ రూట్​ మార్పు

ఇరాన్​లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ఎయిర్ ​ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆ దేశ గగనతలంపై నుంచి విమానాల రాకపోకలు ఆపేసిన్నట్టు వెల్లడించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ దేశాలకు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ఇండియన్స్​కు విదేశాంగ శాఖ ఇప్పటికే సలహా ఇచ్చింది.

నౌకలో 17 మంది ఇండియన్లు 

3ఎంఎస్​సీ ఆరైస్ నౌక​లో మొత్తం 25 మంది సిబ్బంది కాగా అందులో 17 మంది భారతీయులే. వీరంతా ప్రస్తుతం నౌకలోనే ఇరాన్  గార్డ్స్ బందీలుగా ఉన్నారు. వీరిని క్షేమంగా విడిపించేందుకు కేంద్రం  ప్రయత్నాలు చేస్తోంది. టెహ్రాన్, ఢిల్లీ మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని, తమ పౌరులను సేఫ్​ గా పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరినట్లు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.