- దుబాయ్ ఎయిర్ పోర్ట్పై ఇరాన్ దాడి.. విమాన సేవలు పాక్షికంగా బంద్
- టెహ్రాన్లోని మెహ్రాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై ఇజ్రాయెల్ అటాక్
- ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లోని యూఎస్ ఎయిర్బేస్లపై ఇరాన్ బాంబుల వర్షం
- జోర్డాన్ లో యూఎస్కు చెందిన 300 మిలియన్ డాలర్ల థాడ్ రాడార్ పేల్చివేత
- యూఏఈ బేస్ లోని యూఎస్ ఎయిర్ కంబాట్ సెంటర్, శాటిలైట్ కమ్యూనికేషన్ హబ్ పైనా క్షిపణులతో అటాక్
- ఇరాన్పై 80 ఫైటర్ జెట్స్తో బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్
- హార్ముజ్ వద్ద అమెరికా దళాల కోసం వెయిట్ చేస్తున్నామన్న ఐఆర్జీసీ
- గల్ఫ్ దేశాలకు పెజెష్కియాన్ సారీ.. ఆ దేశాలు దాడులు చేయకుంటే మేం అటాక్ చేయమని కామెంట్
న్యూ ఢిల్లీ: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగంలా మారింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యతో మొదలైన యుద్ధం రెండోవారంలోకి ప్రవేశించింది. జోర్డాన్లో అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన 300 మిలియన్ల డాలర్ల థాడ్ రాడార్ సిస్టమ్ను ఇరాన్ దళాలు ధ్వంసం చేసినట్టు శనివారం ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ అటాక్ చేయడంతో.. విమానసేవలు పాక్షికంగా నిలిచిపోయాయి. యూఏఈ బేస్లోని అమెరికాకు చెందిన ఎయిర్ కంబాట్ సెంటర్, శాటిలైట్ కమ్యూనికేషన్ హబ్లను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడంతో పశ్చిమాసియాలో అమెరికా వ్యూహాత్మక నెట్వర్క్ దెబ్బతిన్నది.
గల్ఫ్ దేశాల్లోని యూఎస్ ఎయిర్ బేస్ లక్ష్యంగా ఇరాన్ తన దాడుల పరిధిని విస్తరించింది. దుబాయ్తోపాటు బహ్రెయిన్, సౌదీ అరేబియా లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో అన్ని గల్ఫ్ దేశాల్లో సైరన్లు మోత మోగాయి. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ వందలాది క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో మెహ్రాబాద్ విమానాశ్రయం సమీపంలోని మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. అటు తూర్పు లెబనాన్ పర్వత ప్రాంతాల్లోనూ ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. తూర్పు పట్టణమైన నబీచిత్, సమీప ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 41 మంది మరణించారని, 40 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. హెజ్బొల్లాకు పట్టున్న బీరుట్ దక్షిణ శివార్లలో ఇజ్రాయెల్ వరుస వైమానిక దాడులు చేసింది. ఇదిలా ఉండగా..ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ డిమాండ్ చేయగా.. ‘‘అది అమెరికా కల మాత్రమే.. ఆ కలను సమాధుల వరకు తీసుకెళ్తాం” అని ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ హెచ్చరించారు
గల్ఫ్ దేశాలకు సారీ చెప్పిన పెజెష్కియాన్.. ఆ దేశాల నుంచి దాడులు జరగనంతవరకు తాము అటాక్ చేయబోమని ప్రకటించారు.
ఇరాన్ దాడిలో యూఎస్ థాడ్ రాడార్ సిస్టం ధ్వంసం
అమెరికాకు చెందిన అత్యంత కీలకమైన ‘టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్’ (థాడ్) రాడార్ వ్యవస్థను ఇరాన్ ధ్వంసం చేసినట్లు బ్లూమ్బెర్గ్ నివేదించింది. బాలిస్టిక్ క్షిపణులను గుర్తించి, అడ్డుకోవడంలో అమెరికాకు ఇది అతిపెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ దాడిలో జోర్డాన్లోని మువాఫాక్ సాల్టి ఎయిర్ బేస్లో ఉన్న ఏఎన్/టీపీవై-2 రాడార్ ధ్వంసమైందని ఒక అమెరికా అధికారి ధ్రువీకరించారు.
సుమారు 300 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 2,500 కోట్లు) విలువైన ఈ రాడార్, దూసుకొచ్చే బాలిస్టిక్ క్షిపణులను గుర్తించి, వాటిని కూల్చివేసే ఇంటర్సెప్టర్ క్షిపణులకు మార్గనిర్దేశం చేస్తుంది. ఇరాన్ నుంచి 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఎయిర్ బేస్కు భారీగా నష్టం వాటిల్లింది. రాడార్ వ్యవస్థ ఉన్న చోట రెండు భారీ గుంతలు ఏర్పడ్డాయి, దీనినిబట్టి ఒకటి కంటే ఎక్కువ ప్రొజెక్టైల్స్తో ఇరాన్ దాడి చేసినట్లు తెలుస్తున్నది. భారీ ట్రైలర్లపై అమర్చిన ఈ రాడార్, దాని అనుబంధ పరికరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ రాడార్ వ్యవస్థ పని చేయకపోవడంతో, ఆ ప్రాంతంలో క్షిపణి రక్షణ బాధ్యత ఇప్పుడు పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్పై పడనున్నది. ఈ దాడితో పశ్చిమాసియాలో అమెరికా రక్షణ మౌలిక సదుపాయాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
దుబాయ్ ఎయిర్పోర్ట్పై అటాక్..
దుబాయ్ ఇంటర్నేషనల్ సమీపంలో ఇరాన్ దాడికి యత్నించగా.. అక్కడ భారీగా పొగ కమ్మేసింది. దీంతో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావాల్సిన విమానాలు అక్కడి గగనతలంలో చక్కర్లు కొట్టాయి. ప్రయాణికులు, ఎయిర్పోర్ట్ సిబ్బందికి అధికారులు సేఫ్టీ నోటీసు జారీ చేశారు. ఎయిర్పోర్ట్ టర్మినల్ భవనాల లోపల ప్రత్యేక షెల్టర్లకు వెళ్లాలని సూచించారు. తదుపరి సూచనలు వచ్చే వరకు కిటికీలకు దూరంగా ఉండాలన్నారు. తదుపరి నోటీసు వచ్చేవరకు దుబాయ్కి వచ్చే, అక్కడి నుంచి వెళ్లే తమ అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో ఎయిర్పోర్ట్ వద్ద భారీ పేలుడు ఏదీ జరగలేదని అధికారులు చెప్పారు. ఆ దాడిని అడ్డుకోవడంతో శకలాలు పడిపోయాయని, అది చాలా చిన్న ఘటన అని పేర్కొన్నారు. సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను నమ్మొద్దని పేర్కొన్నారు. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. కొద్దిసేపటికే పరిస్థితులను సమీక్షించిన అనంతరం తిరిగి విమాన రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించారు.
మరోవైపు, అబుదాబిలోని జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భారీ పేలుళ్లు జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కాగా, యూఏఈలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్లో ఉన్న అమెరికాకు చెందిన ఎయిర్ కంబాట్ సెంటర్, శాటిలైట్ కమ్యూనికేషన్ హబ్లపై తాము కచ్చితత్వంతో కూడిన క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. మార్చి 1న ఇరాన్లోని మినాబ్ కౌంటీలోని ఒక పాఠశాలపై జరిగిన దాడికి ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్టు పేర్కొన్నది. ఇదిలా ఉండగా.. ఇరాన్ నుంచి వచ్చిన 16 బాలిస్టిక్ క్షిపణులు, 121 డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సమర్థవంతంగా అడ్డుకున్నాయని యూఏఈ అధికారులు తెలిపారు. అయితే, వీటి శకలాలు పడటం వల్ల కొన్ని చోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.
గల్ఫ్ దేశాల్లో బాంబుల వర్షం
గల్ఫ్ దేశాల్లోని యూఎస్ ఎయిర్ బేస్లే లక్ష్యంగా ఇరాన్ తన దాడుల పరిధిని విస్తరించింది. దుబాయ్తోపాటు బహ్రెయిన్, సౌదీ అరేబియా లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. వేకువజామునే బహ్రెయిన్లో సైరన్లు మోగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. సౌదీలోని అతిపెద్ద షేబా చమురు క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకుని వచ్చిన డ్రోన్లను సౌదీ సైన్యం కూల్చివేసింది. అలాగే, అమెరికా బలగాలు ఉన్న ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ వైపు దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణిని కూడా అడ్డుకుంది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ అల్-కాబీ హెచ్చరించారు. గల్ఫ్ దేశాల నుంచి ఇంధన ఎగుమతులు నిలిచిపోతే, ముడి చమురు ధర బ్యారెల్కు 150 డాలర్లకు చేరుకోవచ్చని ఆయన అంచనా వేశారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర రెండేండ్ల గరిష్ట స్థాయికి (90 డాలర్లు) చేరుకున్నది.
ఇరాన్, లెబనాన్పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
శనివారం తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ వందలాది క్షిపణులతో విరుచుకుపడింది. సుమారు 80 ఇజ్రాయెలీ యుద్ధ విమానాలు ఇరాన్లోని సైనిక స్థావరాలు, బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా 230కి పైగా శక్తివంతమైన బాంబులను ప్రయోగించాయి. మెహరాబాద్ విమానాశ్రయం సమీపంలోని మౌలిక సదుపాయాలు ధ్వంసమైనట్టు తెలుస్తున్నది. తూర్పు లెబనాన్ పర్వత ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఇజ్రాయెల్ దళాలతో తమ పోరాట యోధులు తలపడ్డారని ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూపు హెజ్బుల్లా ప్రకటించింది. తూర్పు పట్టణమైన నబీ చిత్, సమీప ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 41 మంది మరణించారని, 40 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణించిన వారిలో ముగ్గురు తమ సైనికులు ఉన్నారని లెబనాన్ సైన్యం పేర్కొన్నది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు ఆ ప్రాంతంలో తీవ్రమైన ఘర్షణలు, వైమానిక దాడులు జరిగినట్టు తెలిపింది.
అయితే, దీనిపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అదే సమయంలో హెజ్బుల్లాకు బలమైన ఉనికి ఉన్న, వందలాది మంది పౌరులు నివసించే బీరుట్ దక్షిణ శివార్లలో ఇజ్రాయెల్ వరుస వైమానిక దాడులు చేసింది. సోమవారం నుంచి ఇజ్రాయెల్ దాడుల వల్ల 200 మందికి పైగా మరణించారని, 800 మందికి పైగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. ఉత్తర ఇజ్రాయెల్ పట్టణాలైన కిర్యాత్ ష్మోనా, నహరియా నివాసితులు వెంటనే ఖాళీ చేయాలని హెజ్బుల్లా శనివారం హెచ్చరిక జారీ చేసింది. ఆ వెంటనే నహరియా, కిర్యాత్ ష్మోనా, టిబెరియాస్ సమీపంలో హెచ్చరిక సైరన్లు మోగాయి. తాము ఇజ్రాయెలీలను ఖాళీ చేయించబోమని, దానికి బదులుగా గ్రామాలకు, హెజ్బుల్లాకు మధ్య సైనికులను ఉంచి వారిని రక్షిస్తామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అలాగే తమ దళాలు పనిచేస్తున్న దక్షిణ లెబనాన్లో తమ ఉనికిని మరింత పెంచుకుంటామని తేల్చి చెప్పింది.
1,400కు చేరిన మరణాలు
యుద్ధం రెండోవారంలోకి చేరగా.. మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఇప్పటివరకు ఇరాన్, లెబనాన్, ఇజ్రాయెల్ అంతటా కలిపి సుమారు 1,400 మందికి పైగా మరణించారు. ఒక్క ఇరాన్లోనే 1,300 మందికి పైగా బలైనట్లు సమాచారం. యుద్ధం వల్ల పాఠశాలలు, ఆసుపత్రులు, చారిత్రక కట్టడాలు దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు 13 ఆసుపత్రులపై దాడులు జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. గత వారం రోజుల్లో ఇరాన్లోని 3,000 కంటే ఎక్కువ లక్ష్యాలపై దాడులు చేసినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.
హార్మూజ్ వద్ద వెయిట్ చేస్తున్నం.. రండి: ఐఆర్జీసీ
ప్రాంతీయ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) శనివారం అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. హార్మూజ్ జలసంధి వద్ద యూఎస్ దళాలను ఎదుర్కొనేందుకు వేచిచూస్తున్నట్టు పేర్కొన్నది. జలసంధి మీదుగా చమురు నౌకలకు రక్షణగా వెళ్లేందుకు తమ దళాలు సిద్ధమవుతున్నాయని అమెరికా ఇంధన మంత్రి క్రిస్ రైట్ ప్రకటించారు. దీనికి స్పందిస్తూ ఐఆర్జీసీ ఈ హెచ్చరికలు చేసింది. ఐఆర్జీసీ ప్రతినిధి అలీ మహ్మద్ నైని మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు.. 1987లో సూపర్ ట్యాంకర్ బ్రిడ్జ్టన్కు జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. ఇటీవల చమురు నౌకలపై తాము చేసిన దాడినికూడా మర్చిపోవద్దని తెలిపారు.
పక్కదేశాలపై దాడులకు సారీ, కానీ..
అక్కడి నుంచి మాపై దాడి చేస్తే ప్రతిదాడులు తప్పవ్.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్
టెహ్రాన్: తమ పొరుగు దేశాలపై దాడులు చేసినందుకు ఆ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ క్షమాపణ చెప్పారు. పొరుగు దేశాలపై మిసైల్ దాడులు బాధగానే ఉందన్నారు. అయితే, వారి దేశాల నుంచి దాడులు జరిగితే ప్రతిదాడులు తప్పవన్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ‘‘ఇరాన్ దాడికి గురైన పొరుగు దేశాలకు నా తరపున, ఇరాన్ తరపున క్షమాపణలు చెబుతున్నా. అయితే.. ఇజ్రాయెల్, అమెరికాకు మాత్రం లొంగిపోయే ప్రసక్తే లేదు. తమకు ఇరాన్ లొంగిపోతుందని ఆ దేశాలు అనుకుంటే అది భ్రమే అవుతుంది. వారి కోరిక నెరవేరదు” అని పెజెష్కియా పేర్కొన్నారు. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నిస్తామన్నారు. తమ పొరుగు దేశాలపై దాడులను నిలిపివేయాలని తమ తాత్కాలిక నాయకత్వం నిర్ణయించిందని వెల్లడించారు.
