
న్యూఢిల్లీ: కరోనాతో దేశంలో చాలా మంది ఆస్పత్రి పాలు కావడం, కొందరు చనిపోవడంతో సహజంగానే జనంలో భయం మరింత పెరిగింది. తమకూ ఏదైనా ఆపద వస్తే ఏం చేయాలనే ఆందోళన ఎక్కువయింది. అయితే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ఐఆర్డీఏ) కరోనాకు కచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ అందించాలని అన్ని బీమా కంపెనీలను ఆదేశించింది. ఇలాంటి కేసుల క్లెయిమ్స్ను తొందరగా సెటిల్ చేయాలని స్పష్టం చేసింది. అన్ని వ్యాధులకు ఇచ్చినట్టే ఈ వ్యాధికీ కవరేజ్ ఇవ్వడాన్ని తప్పనిసరి చేసింది. క్వారంటైన్కు సంబంధించినవి సహా అన్ని ఖర్చులను కంపెనీలు భరించాలి. డిజిట్ వంటి కొన్ని కంపెనీలైతే కరోనా కోసమే ప్రత్యేకంగా పాలసీలను తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో వివిధ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు కరోనా బీమా కోసం పాటిస్తున్న విధానాల గురించి తెలుసుకుందాం.
ఆదిత్యబిర్లా హెల్త్ ఇన్సూరెన్స్
ఈ కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలన్నీ అన్ని రకాల ఇన్ఫెక్షన్లకు కవరేజీ ఇస్తాయి. ఇందులో సహజంగానే కరోనా కూడా ఉంటుందని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈఓ మయాంక్ బఠ్వాల్ చెప్పారు. ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్, ప్రి హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పటలైజేషన్, అంబులెన్స్ వంటి ఖర్చులన్నీ భరిస్తామని చెప్పారు. త్వరలోనే కరోనా కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని వెల్లడించారు.
ఎడల్వీజ్ జనరల్ ఇన్సూరెన్స్
తమ కంపెనీ అందించే దాదాపు అన్నీ పాలసీలూ కరోనా వంటి మహమ్మారి ట్రీట్మెంట్ ఖర్చులను భరిస్తాయని ఎడల్వీజ్ ఇన్సూరెన్స్ సీఈఓ షనయ్ ఘోష్ చెప్పారు. కీటకాల వల్ల వచ్చే మలేరియా వంటి వ్యాధుల చికిత్సకూ తమ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఎంప్లాయర్ తన ఉద్యోగులకు తమ కంపెనీ పాలసీలు అందజేస్తే అవి కరోనాకు వర్తించేలా మార్చుకోవచ్చని చెప్పారు. తక్కువ ధరల్లోనే తమ కంపెనీలు పాలసీలను అందిస్తున్నదని ఘోష్ వివరించారు. కరోనా అనుమానితులకు, వ్యాధి సోకినవారికి, క్వారంటైన్లో వారికీ అన్ని ట్రీట్మెంట్ ఖర్చులను చెల్లిస్తామని వెల్లడించారు.
ఫ్యూచర్ జనరలి నుంచి కరోనా పాలసీ
కరోనా లాంటి వ్యాధుల కోసం ప్రత్యేక గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అందిస్తున్నామని ఫ్యూచర్ జనరలి తెలిపింది. వ్యాధి సోకినట్టు తేలితే ఖర్చులన్నీ భరిస్తామని సీఈఓ శీరాజ్ దేశ్పాండే వెల్లడించారు. ఇలాంటి రోగాల వల్ల నష్టపోయిన ఆదాయాలను భరించడానికి ప్రత్యేక ఇన్సూరెన్స్ ప్రొడక్టులూ ఉన్నాయన్నారు. కేవలం ఆస్పత్రి ఖర్చులు కవరేజీ చాలనుకుంటే అలాంటి పాలసీలనూ అందుబాటులో ఉంచామని శీరాజ్ చెప్పారు.
కరోనా ఇన్ఫెక్షన్ సోకినట్టు నిర్ధారణ అయితే కవరేజీ మొత్తం చెల్లిస్తారు. ట్రావెల్ రికార్డు, మెడికల్ హిస్టరీని వెల్లడించకుండానే ఈ ప్రత్యేక పాలసీ తీసుకోవచ్చు. క్వారంటైన్కు అయితే సమ్ ఎష్యూర్డ్లో సగమే ఇస్తారు.
ఇతర ఖర్చుల కోసం మరో పది శాతం పొందవచ్చు.
ఎడల్వీజ్ జనరల్ ఇన్సూరెన్స్
కరోనాకు సంబంధించిన అన్ని ఖర్చులకు రీయింబర్స్మెంట్ పొందవచ్చు. కొన్ని పాలసీలహోల్డర్లు విదేశాల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నా ఖర్చులు చెల్లిస్తారు. వీటిలో టెస్టింగ్, ఫార్మసీ, కన్సల్టేషన్ వంటి రకాల ఖర్చులు ఉంటాయి. క్యాష్లెస్ ట్రీట్మెంట్ కావాలంటే మాత్రం కంపెనీతో ఒప్పందం ఉన్న ఆస్పత్రికి మాత్రమే వెళ్లాలి.
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్
కరోనా వల్ల ప్రాణాలు కోల్పోతే హాస్పిటల్ రికార్డులను బట్టి పరిహారం ఇస్తారు. దాదాపు అన్ని పాలసీల్లోనూ ఈ సదుపాయం ఉందని కంపెనీ తెలిపింది. కరోనా వైరస్ ట్రీట్మెంట్ ఖర్చులకు రీయింబర్స్మెంట్ కూడా ఇస్తారు.
మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ
ఈ మహమ్మారి వల్ల మరణించిన వారి కుటుంబ సభ్యులకు ట్రీట్మెంట్ ఖర్చులను చెల్లిస్తామని కంపెనీ తెలిపింది. ఇందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి. అన్ని రకాల మహమ్మారిల వల్ల సంభవించే మరణాలకు తమ పాలసీలు కవరేజీ అందిస్తాయని కంపెనీ చెప్పింది. మెడిక్యాష్, మెడిక్యాస్ ప్లస్ వంటి పాలసీల్లోనూ కరోనాకు కవరేజీ ఉంటుందని పేర్కొంది. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ల పరిధిలోకి ఈ వ్యాధి రాదు.