టెండర్లు అయ్యేదాకా మీటింగ్​కు కేసీఆర్​ పోలే: మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి

టెండర్లు అయ్యేదాకా మీటింగ్​కు కేసీఆర్​ పోలే: మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
  • రోజూ 3టీఎంసీలు ఏపీ తరలించుకునేలా కేసీఆర్​ సహకరించిండు: ఉత్తమ్
  • కేసీఆర్, హరీశ్​రావు పదేండ్లు ఏపీ కోసమే పనిచేసిన్రు
  • అప్పుడు మోసం చేసి ఇప్పుడు నాటకాలాడుతున్నరు
  • బనకచర్లను ఆపేందుకు ఎందాకైనా పోరాడ్తమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఏపీ చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్​ తెలంగాణపాలిట మరణ శాసనమని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అన్నారు. ఆ ప్రాజెక్ట్​ ద్వారా శ్రీశైలం నుంచి రోజూ 3 టీఎంసీలను తరలించుకుపోవాలని ఏపీ కుట్రలు చేస్తున్నదని, దానికి గత  కేసీఆర్​ సర్కారు​ పూర్తిగా సహకరించిందని ఆరోపించారు. 

జగన్​తో అలయ్​ బలయ్​ చేసుకున్నారని, కృష్ణా నీళ్లను ఏపీ దోచుకెళ్లేలా కేసీఆర్​ పూర్తి సహకారం అందించారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న పదేండ్లు  ఏపీ కోసమే కేసీఆర్​, హరీశ్​రావు పనిచేశారని, కృష్ణాలో తెలంగాణ వాటా నీళ్లనూ దోచిపెట్టారని అన్నారు. శుక్రవారం సెక్రటేరియెట్​లోని తన చాంబర్​లో మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి మీడియాతో చిట్​చాట్​చేశారు. 

ఉమ్మడి ఏపీలో కృష్ణా నీళ్లలో తెలంగాణ వాటా అయిన 724 టీఎంసీలను ఏపీ తరలించుకువెళ్తే.. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్​ హయాంలో 1,201.54 టీఎంసీల నీటిని దోచుకెళ్లిందని మంత్రి ఉత్తమ్​ మండిపడ్డారు. కృష్ణా నీళ్లలో రాష్ట్రానికి కేసీఆర్​ తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్​ విస్తరణను చేపట్టింది గత బీఆర్ఎస్​ సర్కారు హయాంలోనేనని గుర్తు చేశారు. ఏపీ రాయలసీమ ప్రాజెక్టును చేపడుతున్నా వారు పట్టించుకోలేదన్నారు. అప్పుడు మోసం చేసి.. ఇప్పుడేం తెలియదన్నట్టుగా బీఆర్ఎస్​ నేతలు నాటకాలాడుతున్నారని ఫైర్​ అయ్యారు.  

టెండర్లు అయ్యేదాకా మీటింగ్​కు కేసీఆర్​ పోలే..

రాయలసీమ లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్టుకు కేసీఆర్​ పూర్తి సహకారం అందించారని మంత్రి ఉత్తమ్​ ఆరోపించారు. ‘‘2020 ఆగస్టు 5న కేంద్రం అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​ నిర్వహించాలని నిర్ణయించింది. కానీ 5న హాజరు కాలేమని, ఆగస్టు 28 తర్వాత ఎప్పుడైనా మీటింగ్​ పెట్టాలని నాటి ప్రిన్సిపల్​ సెక్రటరీ రజత్​కుమార్​ అదే ఏడాది జులై 30న లేఖ రాశారు. అదే ఏడాది ఆగస్టు 10న రాయలసీమ లిఫ్ట్​కు ఏపీ టెండర్లను పిలిచింది. 

అంటే టెండర్లు అయిపోయే వరకు దాని మీద మాట్లాడకూడదని కేసీఆర్​ అనుకున్నారు. ఆ తర్వాత అదే ఏడాది అక్టోబర్​6న నిర్వహించిన అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​లో కేసీఆర్​ పాల్గొన్నారు. అది కూడా వీడియో కాన్ఫరెన్స్​ద్వారా హాజరయ్యారు. ఏపీ టెండర్లు పిలిచే వరకు ఆగారు. అంతేకాదు, కృష్ణా నీటి వాటాలకు సంబంధించి ట్రిబ్యునల్​ తేల్చేంత వరకు అగ్రిమెంట్​ ప్రకారం పాత కేటాయింపులనే కొనసాగించాలని కేసీఆర్​ అపెక్స్​ కౌన్సిల్​లో స్పష్టం చేశారు’’ అని ఉత్తమ్​ వివరించారు. 

2015 నుంచి ప్రతి ఏటా 66:34 నిష్పత్తిలో నీటి వాటాల పంపకానికి సంతకాలు చేశారని ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్టుపై నాటి కేసీఆర్​ ప్రభుత్వం కనీసం సుప్రీంకోర్టులో కేసు కూడా వేయలేదని, అప్పటికే సుప్రీంకోర్టులో కేసు వేసిన గవినోళ్ల శ్రీనివాస్​ కేసులోనే ఇంప్లీడ్​ అయ్యారని గుర్తు చేశారు. 

ముచ్చుమర్రిని అడ్డుకోలే..

ముచ్చుమర్రి ప్రాజెక్ట్​ విస్తరణను ఆనాటి బీఆర్ఎస్​ ప్రభుత్వం కనీసం ఆపే ప్రయత్నమే చేయలేదని మంత్రి ఉత్తమ్​ చెప్పారు. హంద్రీనీవా లిఫ్ట్​ స్కీమ్​ కింద ముచ్చుమర్రి లిఫ్ట్​ ద్వారా శ్రీశైలంలో 797 అడుగుల నుంచే నీటిని తరలించుకుపోయేలా ఏపీ సామర్థ్యాన్ని పెంచుకున్నా పెదవి విప్పలేదన్నారు. 2014కు ముందు ఆ లిఫ్ట్​ ద్వారా 3,850 క్యూసెక్కుల నీటినే తరలించుకుపోతే.. బీఆర్ఎస్​ హయాంలో దాని సామర్థ్యం 6,300 క్యూసెక్కులకు ఏపీ పెంచిందన్నారు. 

అలాగే, మల్యాల లిఫ్ట్​ ద్వారా 833 అడుగుల వద్ద నుంచే 2014కు ముందు 3,850 క్యూసెక్కుల నీటిని తరలించుకెళ్తే.. బీఆర్ఎస్​ వచ్చాక దాని సామర్థ్యం కూడా 6,300 క్యూసెక్కులకు ఏపీ పెంచిందని తెలిపారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం 2014కు ముందు 44 వేల క్యూసెక్కులుంటే.. బీఆర్ఎస్​ హయాంలో 92,600 క్యూసెక్కులకు పెరిగిందన్నారు. 

వెలిగొండ ప్రాజెక్టు ద్వారా 11,500 క్యూసెక్కుల నీటి తరలింపు, కేసీసీ లిఫ్ట్​ ద్వారా వెయ్యి క్యూసెక్కుల తరలింపు కూడా బీఆర్ఎస్​ హయాంలోనే జరిగాయన్నారు. మొత్తంగా 2014కు ముందు శ్రీశైలం నుంచి ఏపీ 47,850 క్యూసెక్కులే (4.1 టీఎంసీలు) తరలించుకుపోతే.. బీఆర్ఎస్​ హయాంలో లక్షా11 వేల 400 క్యూసెక్కుల (9.6 టీఎంసీలు)కు ఏపీ పెంచుకున్నదని ఉత్తమ్​ తెలిపారు. 

బనకచర్లపై పచ్చి అబద్ధాలు..

కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకుండా ఉండి ఉంటే కృష్ణా నదిపై తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి చెప్పారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీని మార్చడం వల్ల అదనంగా రూ.68 వేల కోట్లు వృథా అయ్యాయని అన్నారు. ఆ డబ్బుతో కృష్ణా పరివాహకంలో పెండింగ్​ ప్రాజెక్టులు పూర్తయ్యేవని  పేర్కొన్నారు. 

వాటి వల్ల ఉమ్మడి నల్గొండ, మహబూబ్​నగర్​, ఖమ్మం జిల్లాల్లో 25.64 లక్షల ఎకరాలకు నీళ్లు అందేవని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు పై బీఆర్ఎస్​ నేతలు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఫైర్​ అయ్యారు. బీఆర్ఎస్​ నేతలు జోసెఫ్​ గోబెల్స్​రావు అని పేరు మార్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు.   బనకచర్లతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఉత్తమ్​ చెప్పారు. 

సెంట్రల్​ వాటర్​ కమిషన్​, అపెక్స్​ కౌన్సిల్​, జీఆర్ఎంబీ నిబంధనలకు విరుద్ధంగా బనకచర్లను కడుతున్నార న్నారు. దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు.  దీనిపై ఈ ఏడాది జనవరి 22న ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్​ పాటిల్​కు లేఖ రాశామని, ఆర్థిక సాయం చేయవద్దని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌ కూ​ మరో లేఖ రాశామని మంత్రి ఉత్తమ్​ గుర్తుచేశారు. 

అయితే, ఏపీ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు, రిపోర్టులు తమకు అందలేదని సీఆర్​ పాటిల్​ మే 28న రిప్లై ఇచ్చారన్నారు. చట్ట ప్రకారమే ముందు కెళ్తామని పాటిల్​ హామీ ఇచ్చారని చెప్పారు. చట్టవిరుద్ధంగా ఏపీకి కేంద్రం సహకరిస్తుం దని అనుకోవడం లేదన్నారు.