
- రోజూ 3టీఎంసీలు ఏపీ తరలించుకునేలా కేసీఆర్ సహకరించిండు: ఉత్తమ్
- కేసీఆర్, హరీశ్రావు పదేండ్లు ఏపీ కోసమే పనిచేసిన్రు
- అప్పుడు మోసం చేసి ఇప్పుడు నాటకాలాడుతున్నరు
- బనకచర్లను ఆపేందుకు ఎందాకైనా పోరాడ్తమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఏపీ చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ తెలంగాణపాలిట మరణ శాసనమని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ ప్రాజెక్ట్ ద్వారా శ్రీశైలం నుంచి రోజూ 3 టీఎంసీలను తరలించుకుపోవాలని ఏపీ కుట్రలు చేస్తున్నదని, దానికి గత కేసీఆర్ సర్కారు పూర్తిగా సహకరించిందని ఆరోపించారు.
జగన్తో అలయ్ బలయ్ చేసుకున్నారని, కృష్ణా నీళ్లను ఏపీ దోచుకెళ్లేలా కేసీఆర్ పూర్తి సహకారం అందించారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న పదేండ్లు ఏపీ కోసమే కేసీఆర్, హరీశ్రావు పనిచేశారని, కృష్ణాలో తెలంగాణ వాటా నీళ్లనూ దోచిపెట్టారని అన్నారు. శుక్రవారం సెక్రటేరియెట్లోని తన చాంబర్లో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మీడియాతో చిట్చాట్చేశారు.
ఉమ్మడి ఏపీలో కృష్ణా నీళ్లలో తెలంగాణ వాటా అయిన 724 టీఎంసీలను ఏపీ తరలించుకువెళ్తే.. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ హయాంలో 1,201.54 టీఎంసీల నీటిని దోచుకెళ్లిందని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. కృష్ణా నీళ్లలో రాష్ట్రానికి కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ విస్తరణను చేపట్టింది గత బీఆర్ఎస్ సర్కారు హయాంలోనేనని గుర్తు చేశారు. ఏపీ రాయలసీమ ప్రాజెక్టును చేపడుతున్నా వారు పట్టించుకోలేదన్నారు. అప్పుడు మోసం చేసి.. ఇప్పుడేం తెలియదన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు నాటకాలాడుతున్నారని ఫైర్ అయ్యారు.
టెండర్లు అయ్యేదాకా మీటింగ్కు కేసీఆర్ పోలే..
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కేసీఆర్ పూర్తి సహకారం అందించారని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. ‘‘2020 ఆగస్టు 5న కేంద్రం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. కానీ 5న హాజరు కాలేమని, ఆగస్టు 28 తర్వాత ఎప్పుడైనా మీటింగ్ పెట్టాలని నాటి ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్కుమార్ అదే ఏడాది జులై 30న లేఖ రాశారు. అదే ఏడాది ఆగస్టు 10న రాయలసీమ లిఫ్ట్కు ఏపీ టెండర్లను పిలిచింది.
అంటే టెండర్లు అయిపోయే వరకు దాని మీద మాట్లాడకూడదని కేసీఆర్ అనుకున్నారు. ఆ తర్వాత అదే ఏడాది అక్టోబర్6న నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ పాల్గొన్నారు. అది కూడా వీడియో కాన్ఫరెన్స్ద్వారా హాజరయ్యారు. ఏపీ టెండర్లు పిలిచే వరకు ఆగారు. అంతేకాదు, కృష్ణా నీటి వాటాలకు సంబంధించి ట్రిబ్యునల్ తేల్చేంత వరకు అగ్రిమెంట్ ప్రకారం పాత కేటాయింపులనే కొనసాగించాలని కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్లో స్పష్టం చేశారు’’ అని ఉత్తమ్ వివరించారు.
2015 నుంచి ప్రతి ఏటా 66:34 నిష్పత్తిలో నీటి వాటాల పంపకానికి సంతకాలు చేశారని ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్టుపై నాటి కేసీఆర్ ప్రభుత్వం కనీసం సుప్రీంకోర్టులో కేసు కూడా వేయలేదని, అప్పటికే సుప్రీంకోర్టులో కేసు వేసిన గవినోళ్ల శ్రీనివాస్ కేసులోనే ఇంప్లీడ్ అయ్యారని గుర్తు చేశారు.
ముచ్చుమర్రిని అడ్డుకోలే..
ముచ్చుమర్రి ప్రాజెక్ట్ విస్తరణను ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ఆపే ప్రయత్నమే చేయలేదని మంత్రి ఉత్తమ్ చెప్పారు. హంద్రీనీవా లిఫ్ట్ స్కీమ్ కింద ముచ్చుమర్రి లిఫ్ట్ ద్వారా శ్రీశైలంలో 797 అడుగుల నుంచే నీటిని తరలించుకుపోయేలా ఏపీ సామర్థ్యాన్ని పెంచుకున్నా పెదవి విప్పలేదన్నారు. 2014కు ముందు ఆ లిఫ్ట్ ద్వారా 3,850 క్యూసెక్కుల నీటినే తరలించుకుపోతే.. బీఆర్ఎస్ హయాంలో దాని సామర్థ్యం 6,300 క్యూసెక్కులకు ఏపీ పెంచిందన్నారు.
అలాగే, మల్యాల లిఫ్ట్ ద్వారా 833 అడుగుల వద్ద నుంచే 2014కు ముందు 3,850 క్యూసెక్కుల నీటిని తరలించుకెళ్తే.. బీఆర్ఎస్ వచ్చాక దాని సామర్థ్యం కూడా 6,300 క్యూసెక్కులకు ఏపీ పెంచిందని తెలిపారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం 2014కు ముందు 44 వేల క్యూసెక్కులుంటే.. బీఆర్ఎస్ హయాంలో 92,600 క్యూసెక్కులకు పెరిగిందన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా 11,500 క్యూసెక్కుల నీటి తరలింపు, కేసీసీ లిఫ్ట్ ద్వారా వెయ్యి క్యూసెక్కుల తరలింపు కూడా బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయన్నారు. మొత్తంగా 2014కు ముందు శ్రీశైలం నుంచి ఏపీ 47,850 క్యూసెక్కులే (4.1 టీఎంసీలు) తరలించుకుపోతే.. బీఆర్ఎస్ హయాంలో లక్షా11 వేల 400 క్యూసెక్కుల (9.6 టీఎంసీలు)కు ఏపీ పెంచుకున్నదని ఉత్తమ్ తెలిపారు.
బనకచర్లపై పచ్చి అబద్ధాలు..
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకుండా ఉండి ఉంటే కృష్ణా నదిపై తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీని మార్చడం వల్ల అదనంగా రూ.68 వేల కోట్లు వృథా అయ్యాయని అన్నారు. ఆ డబ్బుతో కృష్ణా పరివాహకంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యేవని పేర్కొన్నారు.
వాటి వల్ల ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో 25.64 లక్షల ఎకరాలకు నీళ్లు అందేవని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు పై బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు జోసెఫ్ గోబెల్స్రావు అని పేరు మార్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. బనకచర్లతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఉత్తమ్ చెప్పారు.
సెంట్రల్ వాటర్ కమిషన్, అపెక్స్ కౌన్సిల్, జీఆర్ఎంబీ నిబంధనలకు విరుద్ధంగా బనకచర్లను కడుతున్నార న్నారు. దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. దీనిపై ఈ ఏడాది జనవరి 22న ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్కు లేఖ రాశామని, ఆర్థిక సాయం చేయవద్దని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూ మరో లేఖ రాశామని మంత్రి ఉత్తమ్ గుర్తుచేశారు.
అయితే, ఏపీ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు, రిపోర్టులు తమకు అందలేదని సీఆర్ పాటిల్ మే 28న రిప్లై ఇచ్చారన్నారు. చట్ట ప్రకారమే ముందు కెళ్తామని పాటిల్ హామీ ఇచ్చారని చెప్పారు. చట్టవిరుద్ధంగా ఏపీకి కేంద్రం సహకరిస్తుం దని అనుకోవడం లేదన్నారు.