స్కూలు ఫీజు కట్టమన్నందుకు.. ఆరేళ్ల కూతుర్ని చంపేశాడు

స్కూలు ఫీజు కట్టమన్నందుకు.. ఆరేళ్ల కూతుర్ని చంపేశాడు

కురుక్షేత్ర: కఠిన బండరాయి మనసు.. అసలు హృదయమనేదే లేదేమో ఆ తండ్రికి.. ఒక్కగానొక్క బిడ్డ.. ముక్కపచ్చలారని ఆరేళ్ల చిన్నారిని చూస్తూ చంపిన కిరాతకుడు. స్కూలు ఫీజు కట్టమని అడిగినందుకు ప్రాణాలు తీశాడు.

పంజాబ్ లోని కురుక్షేత్ర జిల్లా లద్వా సమీపంలో గల దబ్ఖేరా గ్రామంలో బుధవారం రాత్రి జరిగిందీ ఘోరం. ఆ పల్లెలో వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు జస్బీర్ సింగ్, హర్జీందర్ కౌర్ దంపతులు. వారికి ఏకైక కుమార్తె సుమిత. ఆ చిన్నారి వయసు ఆరేళ్లు. కొద్ది రోజులుగా ఆ చిన్నారి స్కూలు ఫీజు కట్టాలని జస్బీర్ సింగ్ ను అతడి భార్య అడుగుతోంది. మళ్లీ మళ్లీ అడుగుతుండడంతో ఆమెపై విసిగించకు అంటూ కోపగించుకునేవాడతను.

ఏమంత వికృత బుద్ధి పుట్టిందో ఏమో గానీ కన్న తండ్రే కాలయముడిగా మారాడు. చూస్తూ చూస్తూ కన్న బిడ్డను చంపేశాడు. తెల్లారి ఆ బిడ్డ చలనం లేకుండా పడి ఉండడాన్ని చూసిన ఆ తల్లి విలవిలలాడిపోయింది. కన్న పేగు తల్లడిల్లిపోయింది. గొంతెండిపోయేలా ఏడ్చి ఏడ్చి.. తమాయించుకుని పోలీసుల వద్దకెళ్లి తన భర్తపై కేసు పెట్టింది. పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు సెర్చ్ చేస్తున్నారు.