- విప్ ధిక్కరణతో వార్డు సభ్యురాలిగా తొలగింపు
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల మాధవిపై అనర్హత వేటు పడింది. పటాన్ చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ 8వ వార్డు నుంచి కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన ఆమె బీఆర్ఎస్ లో చేరారు. చైర్పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి జారీ చేసిన విప్ ను ధిక్కరించి బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారు.
దీనిపై ఫిర్యాదు చేయడంతో ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల అధికారి శ్రీకాంత్ విచారణ జరిపించారు. వైస్ చైర్ పర్సన్ గా ఎన్నికైన మాధవి పార్టీ జారీ చేసిన విప్ ను ధిక్కరించినట్లు తేలడంతో ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకట కిషన్ రావు ప్రకటించారు. వైస్ చైర్ పర్సన్ తో పాటు 8వ వార్డు కౌన్సిలర్ గా ఆమెను తొలగించినట్లు వెల్లడించారు. వైస్ చైర్పర్సన్పై వేటు పడడంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
