గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 16 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 16 మంది మృతి

డీర్ అల్-బలా: గాజా స్ట్రిప్‌‌‌‌‌‌‌‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. శుక్రవారం రాత్రిపూట నుంచి శనివారం ఉదయం వరకు జరిపిన దాడుల్లో  16 మంది పాలస్తీనియన్లు మరణించినట్టు స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్, అమెరికా మద్దతుతో నడిచే ఒక మానవతా సంస్థ నిర్వహించే ఆహార పంపిణీ కేంద్రాల సమీపంలో రాత్రిపూట జరిగిన దాడుల్లో 11 మంది పాలస్తీనియన్లు మరణించారు. 

ఈ కేంద్రాలు గత నెలలో ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు రోజూ ఇలాంటి కాల్పులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ దళాలు జన సమూహంపై కాల్పులు జరిపినట్లు పాలస్తీనియన్ ప్రత్యక్ష సాక్షులు చెప్పగా.. తమ దళాల సమీపంలోకి వచ్చిన అనుమానితుల వద్ద హెచ్చరిక కాల్పులు మాత్రమే జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. 

ఈ కాల్పులపై ఆర్మీ వెంటనే స్పందించలేదు. ఈ కేంద్రాలను నిర్వహించే గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ అనే ప్రైవేట్ సంస్థ.. శనివారం ఈ కేంద్రాలు మూసివేసినట్లు తెలిపింది. అయితే, ఆహారం కోసం వేలాది మంది ఈ కేంద్రాల సమీపంలో గుమిగూడారని సాక్షులు చెప్పారు. సెంట్రల్ గాజాలోని ఒక జీహెచ్​ఎఫ్​ కేంద్రం సమీపంలో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మృతదేహాలు లభ్యమయ్యాయని, మరో 125 మంది గాయపడి ఆస్పత్రికి వచ్చారని అల్-అవ్దా హాస్పిటల్ తెలిపింది.

సమీపంలోని బురేజ్ శరణార్థి శిబిరంలో ఉన్న మొహమ్మద్ అబు హుస్సేన్ మాట్లాడుతూ.. ఆహార పంపిణీ కేంద్రం నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఇజ్రాయెల్ దళాలు జన సమూహంపై కాల్పులు జరిపాయని తెలిపాడు. వేలాది మంది పరుగెత్తుతుండగా.. 
పలువురు నేలకొరిగారని అతను తెలిపాడు.