డిసెంబర్ లోపు పీఎస్ఎల్వీ సీ-49 ప్రయోగం
మార్చిలోగా మూడు ప్రయోగాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఇస్రో్
నెల్లూరు: కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి కారణంగా అనేక ప్రయోగాలను వాయిదా వేసుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. ఈ ఏడాది డిసెంబర్లోపు ఒక్క ప్రయోగమైనా చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా కనీసం మరో మూడు ప్రయోగాలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో.. లాక్డౌన్ను క్రమంగా సడలింపులిచ్చుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం అన్ని విభాగాల్లో భౌతిక దూరాన్ని పాటిస్తూ 50 శాతం మంది అధికారులు, సిబ్బంది విధులకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయోగాలను మళ్లీ ప్రారంభించేందుకు ఇస్రో సన్నాహాలు చేసుకుంటోంది.
ఈ ఏడాది డిసెంబర్ నెలలోపు పీఎస్ఎల్వీ సీ-49 ప్రయోగాన్ని పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు పీఎస్ఎల్వీ సీ-50.. ఈ ఏడాది మార్చి 5న ఆఖరి నిమిషంలో వాయిదా పడిన జీఎస్ఎల్వీ ఎఫ్-10 ప్రయోగాన్ని 2021 మార్చి ఆఖరు నాటికి పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తున్నట్లు సమాచారం. చిన్న చిన్న ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) ప్రయోగాన్ని కూడా మొట్ట మొదటిసారి ప్రయోగాత్మకంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది ఇస్రో.