సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణను స్వాగతిస్తున్నం : బండి సంజయ్

సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణను స్వాగతిస్తున్నం : బండి సంజయ్

నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలన్న హైకోర్టు నిర్ణయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్వాగతించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వులపై సంతృప్తి వ్యక్తంచేశారు. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలన్నదే బీజేపీ అభిమతమని బండి చెప్పారు. హైకోర్టు ఉత్తర్వులతో విచారణ పారదర్శకంగా జరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. 

బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. సీఎం ప్రెస్ మీట్ నిర్వహించడంపై హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అభినందనీయమన్నారు. తప్పు చేసినోళ్లకు, కుట్రదారులకు శిక్ష పడాల్సిందేనన్నారు. తెలంగాణ ప్రజలు కూడా కోరుకునేది ఇదే అని చెప్పారు. హైకోర్టు ధర్మాసనంపట్ల తమకు నమ్మకం ఉందన్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.  ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుక కుట్రదారులెవరన్నది తేలడంతో పాటు దోషులకు తగిన శిక్ష పడుతుందనే నమ్మకం ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు.