హైదరాబాద్ లో భారీ వర్షం.. రోడ్లు జలమయం

హైదరాబాద్ లో భారీ వర్షం.. రోడ్లు జలమయం

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ పాటు పలు జిల్లాల్లో వర్షం పడుతోంది. సిటీలో సాయంత్రం వెదర్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఉప్పల్, పీర్జాది గూడ, తార్నాక, రాజేంద్ర నగర్, మైలార్ దేవ్ పల్లి, అత్తాపూర్, బండ్లగూడ జాగీర్, కిస్మత్ పూర్, హిమాయత్ సాగర్, నార్సింగి, మణికొండ, పుపాల్ గూడ, గండిపేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆ ప్రాంతాల్లోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. భారీగా వర్షం కురవడంతో ఉప్పల్ ఏరియాలోని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బండి గార్డెన్స్ లైన్ లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్డుపై వెళ్తున్న స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్దిపాటి వర్షానికే రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడం, ఇండ్లలోకి వరదనీరు వచ్చి చేరుతోందని వాపోతున్నారు. వర్షం కురిసిన ప్రతిసారీ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయని చెబుతున్నారు. వరదనీటిలో ఇబ్బందులు పడుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.

నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షం..

చర్లపల్లి లో 4.2 సెంటీమీటర్లు, బండ్లగూడ రామంతపూర్  లో 4.1  సెంటీమీటర్లు, ఏఎస్ రావు నగర్ లో 3.9 సెంటీమీటర్లు, సరూర్ నగర్ లో 3.2 సెంటీమీటర్లు, హబ్సిగూడ లో 3 సెంటీమీటర్లు, ఎల్.బీ.నగర్ లో 2.8 సెంటీమీటర్లు, మెట్టుగూడలో 2.3 సెంటీమీటర్లు, చిలకనగర్ లో 1.8 సెంటీమీటర్లు, సీతాఫల్మండిలో 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

వాతావరణ శాఖ సూచన

వాతావరణ శాఖ వచ్చే మూడురోజుల పాటు రాష్ట్రానికి వర్ష సూచన చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ, రేపు రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.