చరిత్రకు సాక్ష్యంగా వందల ఏండ్ల నాటి కట్టడాలు, టూరిస్ట్ ప్లేస్లు మనదేశంలో లెక్కలేనన్ని ఉన్నాయి. కానీ, వందల ఏండ్ల నాటి చెట్లు మాత్రం చాలా తక్కువ. అలాంటిదే ఈ పెద్ద మర్రిచెట్టు. ‘పిల్లలమర్రి’గా బాగా ఫేమస్ అయిన ఈ చెట్టు మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ వందల కొద్ది ఊడలతో, ఆకుపచ్చని కొమ్మలతో టూరిస్టుల్ని ఆకట్టుకుంటోంది. దూరం నుంచి చూస్తే చిన్న కొండలా కనిపిస్తుంది. కానీ, దగ్గరికి వెళ్లి చూస్తే ఆకుపచ్చని పందిరి పరిచిన పెద్ద గొడుగులా ఉంటుంది. వీకెండ్ టూర్ వెళ్లాలి అనుకునే వాళ్లకి పచ్చదనంతో, పక్షుల కిలకిలరావాలతో పలకరించే ‘పిల్లలమర్రి’ పర్ఫెక్ట్ ఛాయిస్.
ఈ మర్రి చెట్టు ఊడల నుంచి చిన్న చిన్న మర్రి చెట్లు చాలా వచ్చాయి. అందుకే దీనికి ‘పిల్లలమర్రి’ అని పేరొచ్చింది. శాఖలుగా విస్తరించిన ఈ మర్రి చెట్టు మొదలు ఎక్కడ ఉందో కనిపెట్టడం చాలా కష్టం. పిల్లల మర్రి చెట్టు దాదాపు 800 ఏండ్ల కాలం నాటిది. మనదేశంలోని అతిపెద్ద మర్రిచెట్లలో ఇది మూడోదిగా గుర్తింపు పొందింది కూడా. దాదాపు మూడెకరాల్లో విస్తరించిన ఈ చెట్టు అడవిని తలపిస్తుంది.
ఇక్కడి అట్రాక్షన్స్
ఇక్కడి అక్వేరియం, జూ, ఆర్కియాలజీ మ్యూజియం చూస్తూ జాలీగా గడిపేయొచ్చు. వర్షాకాలంలో ఇక్కడ బోటు షికారు ఫెసిలిటీ ఉంటుంది. జింకల పార్కు, పిల్లల పార్కులు ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి పిక్నిక్ వెళ్లేందుకు ఈ ప్లేస్ బాగుంటుంది. ఇక్కడ ఉన్న శివాలయం స్పెషల్ అట్రాక్షన్. శ్రీశైలం డాం కడుతున్న టైంలో మునిగిపోయిన ఈ శివాలయాన్ని ఇక్కడ మళ్లీ కట్టించారు. మహబూబ్నగర్ నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ‘పిల్లలమర్రి’ని చూసేందుకు టూరిస్ట్లు వెళ్తారు.
ఇలా వెళ్లాలి
మహబూబ్నగర్ జిల్లా నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది పిల్లలమర్రి. హైదరాబాద్ నుంచి అయితే 90 కిలోమీటర్ల జర్నీ.
టైమింగ్స్: ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు.
ఎంట్రీ ఫీజు : పెద్దవాళ్లకి ఐదు రూపాయలు. పిల్లలకి ఎంట్రీ ఫ్రీ.
కెమెరా, వీడియో కెమెరా తీసుకెళ్లాలనుకుంటే రూ.25 కట్టాలి.