దేశంలోని అతిపెద్ద మర్రిచెట్లలో ఇది మూడోది

దేశంలోని అతిపెద్ద మర్రిచెట్లలో ఇది మూడోది

చరిత్రకు సాక్ష్యంగా వందల ఏండ్ల నాటి కట్టడాలు, టూరిస్ట్​ ప్లేస్​లు మనదేశంలో లెక్కలేనన్ని ఉన్నాయి. కానీ, వందల ఏండ్ల నాటి చెట్లు మాత్రం చాలా తక్కువ. అలాంటిదే ఈ పెద్ద మర్రిచెట్టు. ‘పిల్లలమర్రి’గా బాగా ఫేమస్​ అయిన ఈ చెట్టు మహబూబ్​నగర్​ జిల్లాలో ఉంది. ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ వందల కొద్ది ఊడలతో, ఆకుపచ్చని కొమ్మలతో టూరిస్టుల్ని ఆకట్టుకుంటోంది. దూరం నుంచి చూస్తే చిన్న కొండలా కనిపిస్తుంది. కానీ, దగ్గరికి వెళ్లి చూస్తే  ఆకుపచ్చని పందిరి పరిచిన పెద్ద గొడుగులా ఉంటుంది. వీకెండ్​ టూర్ వెళ్లాలి అనుకునే వాళ్లకి పచ్చదనంతో, పక్షుల కిలకిలరావాలతో పలకరించే ‘పిల్లలమర్రి’ పర్ఫెక్ట్​ ఛాయిస్​.

ఈ మర్రి చెట్టు ఊడల నుంచి చిన్న చిన్న మర్రి చెట్లు చాలా వచ్చాయి. అందుకే దీనికి ‘పిల్లలమర్రి’ అని పేరొచ్చింది. శాఖలుగా విస్తరించిన ఈ మర్రి చెట్టు మొదలు ఎక్కడ ఉందో కనిపెట్టడం చాలా కష్టం.  పిల్లల మర్రి చెట్టు దాదాపు 800 ఏండ్ల కాలం నాటిది. మనదేశంలోని అతిపెద్ద మర్రిచెట్లలో ఇది మూడోదిగా గుర్తింపు పొందింది కూడా. దాదాపు మూడెకరాల్లో విస్తరించిన ఈ చెట్టు అడవిని తలపిస్తుంది.
   
ఇక్కడి అట్రాక్షన్స్​
ఇక్కడి అక్వేరియం, జూ, ఆర్కియాలజీ​ మ్యూజియం చూస్తూ జాలీగా గడిపేయొచ్చు. వర్షాకాలంలో ఇక్కడ బోటు షికారు ఫెసిలిటీ ఉంటుంది. జింకల పార్కు, పిల్లల పార్కులు ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి పిక్నిక్​ వెళ్లేందుకు ఈ ప్లేస్​ బాగుంటుంది. ఇక్కడ ఉన్న శివాలయం స్పెషల్​ అట్రాక్షన్​.  శ్రీశైలం డాం కడుతున్న టైంలో మునిగిపోయిన ఈ శివాలయాన్ని ఇక్కడ మళ్లీ కట్టించారు. మహబూబ్​నగర్​ నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ‘పిల్లలమర్రి’ని చూసేందుకు టూరిస్ట్​లు వెళ్తారు. 

ఇలా వెళ్లాలి
మహబూబ్​నగర్​ జిల్లా నుంచి 3  కిలోమీటర్ల దూరంలో ఉంది పిల్లలమర్రి. హైదరాబాద్​ నుంచి అయితే 90 కిలోమీటర్ల జర్నీ. 
టైమింగ్స్​: ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు. 
ఎంట్రీ ఫీజు : పెద్దవాళ్లకి  ఐదు రూపాయలు. పిల్లలకి ఎంట్రీ ఫ్రీ. 
కెమెరా, వీడియో కెమెరా తీసుకెళ్లాలనుకుంటే రూ.25 కట్టాలి.