ఏడాదిలో రెండుసార్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ పెడితే బాగుంటదని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. బుక్ ఫెయిర్లు ఎంత గొప్పవో మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నప్పుడు తెలిసిందన్నారు. ఈ బుక్ ఫెయిర్ కు మిద్దె రాములు ప్రాంగణం, అలిశెట్టి ప్రభాకర్ వేదికగా పేర్లు పెట్టడం స్ఫూర్తిదాయకమని తెలిపారు. అక్షరం నక్షత్రంలా నిలిచి ఉంటుంది..పుస్తకాలు ఎక్కువగా చదివి జ్ఞానాన్ని అంతా గూగుల్లో నిక్షిప్తం చేయాలని సూచించారు. భారతదేశంలో వేదాలు, ఉపనిషత్తులను ఇతర భాషల్లోకి అనువాదించాలన్నారు.
ఈ బుక్ ఫెయిర్ లో చిన్నపిల్లలతో కలిసి తల్లిదండ్రులు వచ్చి పుస్తకాలు చూస్తుంటే సంతోషంగా ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడించారు. ఇంటర్నెట్, ల్యాప్ టాప్ లు వచ్చాక పుస్తకాలకు ఆదరణ ఉండదననుకున్నారు.. పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలని చెప్పారు. ఇలాంటి బుక్ ఫెయిర్లు మరిన్ని రావాలని, మిగతా జిల్లాలో బుక్ ఫెయిర్లు ఏర్పాటు చేయాలన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని తెలిపారు. ఈ తరం పిల్లలకు నీతి కథలను అలవాటు చేయాలని తల్లిదండ్రులకు సూచించారు.
హైదరాబాద్ లో 100 స్కూళ్లను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని సిలబస్ మార్చే విధంగా కృషి చేస్తున్నాం...అందులో నీతి కథలు, పర్యావరణం, వ్యక్తిత్వ నిర్మాణం, సమాజం అంటే ఏంటో తెలిపే విధంగా పాఠ్యాంశాలుగా చేర్చబోతున్నట్లు ప్రకటించారు. తాము విద్యార్థులుగా ఉన్నప్పుడు ఏ భావజాలమైనా చర్చోపచర్చలు చేసేవాళ్లం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కనిపించడం లేదన్నారు. వ్యక్తి నిర్మాణంలో పుస్తకాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. లింబాద్రి తెలిపారు. బుక్ ఫెయిర్ కు వేదికను సీఎం కేసీఆర్ ఉచితంగా ఇచ్చారని, అది పాఠకులకు ఎంతో ఉపయుక్తమన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలిపారు.

