- లేకపోతే ప్రగతిభవన్ను ముట్టడిస్తం
- తెలంగాణ రాష్ట్ర రవాణారంగ
- కార్మిక సంఘాల జేఏసీ హెచ్చరిక
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ట్రాన్స్ పోర్ట్కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర రవాణారంగ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. రవాణా రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని జేఏసీ కోరింది. లేనిపక్షంలో కార్మికులతో కలిసి ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు గురువారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్మిక సంఘాల జేఏసీ మహా సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో ఏఐటీయూసీ సీనియర్ నేతలు వీఎస్ బోస్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్ రావు, ఐఎఫ్టీయూ నేతలు సూర్యం, వెంకటేశ్తోపాటు జేఏసీ రాష్ట్ర నేతలు సిహెచ్. జంగయ్య, కొంరెల్లి బాబు, బైరగోని రాజు గౌడ్ (ఏఐటీయుసీ), వి. మారయ్య (బీఆర్టీయు), శ్రీకాంత్, అజయ్ బాబు (సీఐటియు), ఏ. సత్తి రెడ్డి (టీఏడిఎస్), కిరణ్ (ఐఎఫ్టియు), మొహమ్మద్ అమానుల్లా ఖాన్ (ఆటో జేఏసీ) నగేశ్ (బిఆర్ఎస్.కెవి) తిరుమలేశ్, డి. ఆంజనేయులు, షేక్ సలావుద్దీన్, సతీష్, సురేష్ నంద హాజరై మాట్లాడారు.
నిత్యావసరాల రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న రవాణారంగ కార్మికులు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. గత పది ఏండ్లలో ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపైనా ఆటో, క్యాబ్ మీటర్ చార్జీలు పెంచలేదన్నారు. రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దుర్మార్గమన్నారు. ఆటో, క్యాబ్ మీటర్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని లేనిపక్షంలో తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.