
ఖైరతాబాద్, వెలుగు : బీసీని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన పార్టీకే తాము మద్దతిస్తామని బీసీ కుల సంఘాల జేఏసీ వెల్లడించింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ , గణేశ్ చారి,అనిల్ కుమార్ తదితరులు మాట్లాడుతూ..బీసీలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. బీసీ కుల వృత్తులకు రూ. లక్ష బదులు బీసీ బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు సబ్ ప్లాన్, జనాభా ఆధారంగా నిధులు, బీసీ కార్పొరేషన్ కు రూ. వెయ్యి కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్ కు వెయ్యి కోట్లు, ప్రతి కుల ఫెడరేషన్ 100 కోట్లు, సంచార జాతుల ఫెడరేషన్కు100 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ వాగ్దానాలను నేటికి అమలు చేయలేదని ఆరోపించారు. ఇప్పటి వరకు బీసీ రుణాలకు 9,20,000 మంది దరఖాస్తు చేసుకుంటే ఒక్కరికి కూడా లోన్ ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ రూ. లక్ష పేరిట కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు.