విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించేందుకు కుట్ర: జగదీశ్‌రెడ్డి ఆరోపణ

విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించేందుకు కుట్ర: జగదీశ్‌రెడ్డి ఆరోపణ

ప్రైవేటీకరించేందుకు సర్కారు కుట్ర చేస్తోందని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. విద్యుత్  బిల్లుల వసూలును అదానీకి అప్పగించేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. 

 ‘‘ప్రైవేటు వ్యక్తులు విద్యుత్  బిల్లులు వసూలు చేసేందుకు పైలట్ ప్రాజెక్టుగా పాతబస్తీని ఎంచుకున్నారు. కానీ, అది అక్కడికే పరిమితం కాదు, రాష్ట్రం మొత్తం విద్యుత్  బిల్లుల వసూలు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వబోతున్నారు. విద్యుత్  రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా కాంగ్రెస్  ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యుత్  సబ్సిడీలు, రైతులకు ఉచిత కరెంటు ఇక ఉండదు. రైతుల విద్యుత్  మోటార్లకు మీటర్లు పెడతారు. ప్రధాని నరేంద్ర మోదీ కనుసన్నల్లో సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారు” అని జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

మోదీ, అదానీ విధానాలను మన రాష్ట్రంలో సీఎం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘విద్యుత్  సంస్థ ప్రజల ఆస్తి. ఓల్డ్ సిటీలో 45 శాతం మాత్రమే కరెంటు బిల్లులు వసూలవుతున్నాయి. అందుకే ప్రైవేట్‌ వ్యక్తులకు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి అంటున్నారు. రాష్ట్రంలో 95 నుంచి 97 శాతం వరకు కరెంటు బిల్లులు వసూలవుతున్నాయి. ఓల్డ్ సిటీ ప్రజలను అవమానించేలా రేవంత్ చర్యలు ఉన్నాయి” అని జగదీశ్‌ రెడ్డి ఫైర్  అయ్యారు.