- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రాలు, యూటీల వారీగా కుల గణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. జనగణనలో ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీల కుటుంబ లెక్కలను కూడా నమోదు చేయాలన్నారు. బుధవారం ఢిల్లీలో జాజుల నేతృత్వంలో బీసీ సంఘాల ప్రతినిధులు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లను వేర్వేరుగా కలిశారు.
అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని మంత్రులను కోరినట్లు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే కుటుంబ లెక్కింపులో ఉన్న 33 కాలమ్లతో పాటు 34వ కాలమ్గా ఓబీసీ కుటుంబాల వివరాలను చేర్చాలని సూచించారు.
