
- బీఆర్ఎస్లో అగ్రకులాలకో న్యాయం, బీసీలకో న్యాయమా: జాజుల శ్రీనివాస్ గౌడ్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: పార్టీ నియమాలను ధిక్కరిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ ఎస్ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్లో పార్టీలో అగ్రకులాలకో న్యాయం, బీసీలకో న్యాయమా? అని నిలదీశారు. అంద రికీ ఒకే న్యాయమైతే ఈటల రాజేందర్ను బర్తరఫ్ చేసినట్టే కవితను కూడా పార్టీ నుంచి బర్తరఫ్ ఎందుకు చేయట్లేదని శుక్రవారం ఓ ప్రకటన ద్వారా ప్రశ్నించారు.
"పార్టీకి మేము కూడా ఓనర్లమేనన్న ఈటల రాజేందర్ను మంత్రి పదవి నుంచి తొలగించి పార్టీలోంచి తొలగించారు. పార్టీ నియమాలను ఉల్లంఘించారని టైగర్ నరేంద్ర, విజయశాంతిలను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. మరిప్పుడు బీఆర్ఎస్ పార్టీ తనదేనని కవిత కామెంట్లు చేశారు. పార్టీ నియమాలను ఉల్లంఘించారు. ఆమెపై కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు" అని జాజుల నిలదీశారు.