న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్కిశోర్ ప్రకటించారు. పార్టీ మంచి కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. బుధవారం ఆయన ఓ మీడియా ఇంటర్వ్యూలో ఈ అంశాన్ని ధ్రువీకరించారు.
ప్రశాంత్ కిశోర్ రాఘోపూర్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్తో పోటీ పడతారని ప్రచారం జరిగింది. అయితే, సోమవారం జన్ సురాజ్ పార్టీ విడుదల చేసిన రెండో జాబితాలోనూ కిశోర్ పేరు లేదు. తేజస్వీపై ఆ పార్టీ చంచల్ సింగ్ను నిలబెట్టింది.
ఈ సందర్భంగా పీకే మాట్లాడుతూ.. "నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించింది. అందువల్ల, తేజస్వీ యాదవ్కు వ్యతిరేకంగా రఘోపూర్ నుంచి మరొక అభ్యర్థిని ప్రకటించింది. ఇది పార్టీ విస్తృత ప్రయోజనాల కోసం మేము తీసుకున్న నిర్ణయం. నేను పోటీ చేస్తే.. పార్టీ సంస్థాగత పని నుంచి నన్ను దూరం చేసేది" అని కిశోర్ అన్నారు.
