
- కొత్తపేటలో నిర్మిస్తున్న ఆస్పత్రికి ఆయన పేరు పెట్టాలి: జానారెడ్డి
- మోదీ, షా తలకిందుల తపస్సు చేసినా కమ్యూనిజాన్ని ఆపలేరు: నారాయణ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాటంతో రాచరిక పాలనకు చరమగీతం పాడిన గొప్ప కమ్యూనిస్టు యోధుడు రావి నారాయణరెడ్డి అని పలువురు వక్తలు కొనియాడారు. హైదరాబాద్లో ఆ మహా నాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు కొత్తపేటలో నిర్మిస్తున్న ఆసుపత్రికి రావి నారాయణరెడ్డి పేరు పెట్టి సముచిత గౌరవం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం బంజారా హిల్స్లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాపరెడ్డి అధ్యక్షతన పద్మ విభూషణ్ రావి నారాయణరెడ్డి 118వ జయంతి వేడుకలు నిర్వహించారు.
అంతకు ముందు అతిథులు రావి నారాయణరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి మాట్లాడుతూ.. రావి నారాయణ రెడ్డి తనకున్న 500 ఎకరాల భూమి పేదలకు పంచడం ద్వారా భూదాన ఉద్యమానికే స్ఫూర్తి ప్రదాతగా నిలిచారన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తలకిందులుగా తపస్సు చేసినా కమ్యూనిజాన్ని ఆపలేరన్నారు. మావోయిస్టులను భౌతికంగా నిర్మూలించగలరేమో గాని సిద్ధాంతాన్ని నిర్మూలించడం వారి తరం కాదన్నారు. నారాయణరెడ్డి విగ్రహం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. ఏక కాలంలో సామాజిక, ఆర్థిక సమానత్వం, రాజకీయ స్వేచ్ఛ కోసం సాగించిన సాయుధ పోరాటంతోనే నిజాం గద్దే దిగినా.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆశించినట్లు ముందుకు సాగలేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ నాయకులు సురవరం సుధాకర్రెడ్డి, రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, బొమ్మగాని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.