మద్యం అమ్మితే రూ. లక్ష ఫైన్..పట్టిస్తే రూ.10 వేలు నజరానా.. ఎక్కడంటే..!

మద్యం అమ్మితే రూ. లక్ష ఫైన్..పట్టిస్తే రూ.10 వేలు నజరానా.. ఎక్కడంటే..!
  • మద్యాన్ని నిషేధిస్తున్న  కొత్త పాలకవర్గాలు 
  • జనగామ జిల్లాలో  పలు పంచాయతీల్లో అమలు 
  • అదే బాటలో మరికొన్ని గ్రామాల్లో  బంద్ కు రెడీ 

బచ్చన్నపేట, వెలుగు: పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు మద్యం అమ్మకాలను నిషేధిస్తున్నాయి. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని నారాయణపూర్​పాలకవర్గం ముందుగా బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు బంద్ చేయించింది. అదే బాటలో బుధవారం చిన్నరామచర్లలో సర్పంచ్​ఎండీ ఆజాం అధ్యక్షతన గ్రామ సభ ఏర్పాటై..  ఫిబ్రవరి 1 నుంచి మద్యం అమ్మకాలు బంద్​చేసేందుకు తీర్మానించింది. 

పర్యవేక్షణకు సర్పంచ్​ఆజాం చైర్మన్​గా, ఉప సర్పంచ్​కంత్రి యాదయ్య వైస్​చైర్మన్​గా, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు సభ్యులుగా మద్యనిషేధ కమిటీ ఏర్పాటు చేశారు.  మద్యం అమ్మినవారికి రూ. 1లక్ష జరిమానా, పట్టించినవారికి రూ. 10వేలు నజరానాను ప్రకటించారు. 

మద్యాన్ని నిషేధించేందుకు  బండ నాగారం, కొడువటూరు, వీఎస్​ఆర్​నగర్​పంచాయతీలు కూడా రెడీ అయ్యాయి. గ్రామాల్లో కొందరు యువత ఉదయం, సాయంత్రం తాగుతూ మద్యం మత్తులో గొడవలు పడుతున్నారు. దీంతో సర్పంచ్​లు ఆలోచన చేసి మద్యాన్ని బంద్ చేసేందుకు​నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు మద్య నిషేధంపై యువకులు మండిపడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం మద్యం పంచి, ఇప్పుడు నిషేధిస్తామంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.