
జమ్ముకశ్మీర్ లో పుల్వామా తరహా దాడి జరపడానికి జైష్-ఎ-మొహమ్మద్ (JEM) కుట్ర చేస్తోందని…ఇందుకోసం శిక్షణ పొందిన ఉగ్రవాదులతో ‘ఘజ్నవీ ఫోర్స్’ అనే కొత్త గ్రూపును ఏర్పాటు చేసిందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఘజ్నవీ ఫోర్స్లో నిషేధిత ఉగ్రవాద సంస్థలైన LET, హిజ్బుల్ ముజాహిదీన్, ఔఘ్, అల్ బదర్లకు చెందిన ఉగ్రవాదులున్నారు. భారత్లో భద్రతా దళాలు, వారి కాన్వాయ్లు, అతి ముఖ్యమైన స్థావరాలు, సరిహద్దుల్లోని ఔట్పోస్టులు మొదలైన వాటి దగ్గర IEDలను అమర్చి పేల్చివేయడానికి ఘజ్నవీ ఫోర్స్ ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అలర్టైన కేంద్రం ..అనుమానం ఉన్న ప్రాంతాల్లో భద్రతా దళాలతో నిఘా ఏర్పాటు చేసింది. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అధికారులు. బోర్డర్ లో వాహనాల తనిఖీలు చేపట్టారు.