హైదరాబాద్/ఎల్బీ నగర్/ఘట్కేసర్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి కొండా సురేఖ, సీనియర్నేత జగ్గారెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఆధ్వర్యంలో బీజేపీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి పులిమామిడి రాజు తన అనుచరులతో కాంగ్రెస్లో చేరారు.
మాజీ ఎమ్మెల్సీ వెంకట్ రెడ్డి ఆధ్వరంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూటీఎస్ మాజీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మక్తల్ బీజేపీ నేత జలంధర్ రెడ్డి, అతని అనుచరులు హస్తం పార్టీ గూటికి చేరారు. రేవంత్ రెడ్డి తన నివాసంలో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎల్బీ నగర్లో బీఆర్ఎస్కు షాక్
ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముద్దగోని రామ్మోహన్ గౌడ్ దంపతులతో పాటు ఆ పార్టీ ముఖ్య నాయకులు శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రామ్మోహన్ గౌడ్ నియోజకవర్గంలో కీలక నాయకుడిగా ఉన్నారు. ఆయన భార్య లక్ష్మీ ప్రసన్న బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ గా పనిచేశారు.
వీరితో పాటు నియోజకవర్గ ఎస్సీ సెల్ ముఖ్య నాయకులు జోగు రాములు, గడ్డి అన్నారం మార్కెట్ మాజీ డైరెక్టర్ కత్తుల రాంబాబు, రంజిత్ గౌడ్, మనీశ్, శాలిని, వెంకట కృష్ణ, నగేశ్, శంకర్, ఉషారాణి తదితరులు పార్టీలో చేరారు.
కాంగ్రెస్లోకి ఘట్ కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ తోపాటు పలువురు కౌన్సిలర్లు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో చేరగా, వారికి రేవంత్రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.