ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేషన్ అనగానే ఎన్నో హిట్ సినిమాలు, మరెన్నో ఎవర్ గ్రీన్ పాటలు గుర్తొస్తాయి. ఇప్పుడా సూపర్ హిట్ పెయిర్ని గుర్తు చేసేలా జూనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కలిసి నటించబోతున్నారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా జాన్వీకపూర్ను ఫైనల్ చేస్తూ సోమవారం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. జాన్వీ కపూర్ను ఫైనల్ చేశారనే వార్తలు కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్నాయి.
వాటినే నిజం చేస్తూ.. జాన్వీ బర్త్ డే సందర్భంగా ఆమె పేరును ప్రకటించారు. ‘ఆమె భయంకరమైన తుఫాన్లో ప్రశాంతత లాంటిది’ అంటూ తన పాత్రను పరిచయం చేశారు. తెలుగులో జాన్వీకపూర్కు ఇదే ఫస్ట్ మూవీ. తన ఫేవరేట్ హీరో ఎన్టీఆర్తో కలిసి నటించడం హ్యాపీగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది జాన్వీ. త్వరలో ఈ మూవీ షూటింగ్ మొదలవనుంది. ఇదిలా ఉంటే ఈనెల 13న అమెరికాలో జరగబోయే ‘ఆస్కార్’ ఈవెంట్లో పాల్గొనేందుకు సోమవారం అమెరికా బయల్దేరాడు ఎన్టీఆర్. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అందరూ అమెరికా వెళ్లగా.. తారకరత్న మరణంతో ఆలస్యంగా వెళ్తున్నాడు తారక్.