తారక్.. ఎక్కడో ఫరక్! ..ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు నో

తారక్.. ఎక్కడో ఫరక్! ..ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు నో

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు తారక్ దూరంగా ఉంటున్నారు. ఇవాళ సాయంత్రం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు సమీపంలోని కైత్లాపూర్ లో భారీ ఎత్తున ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు, ప్రత్యేక అతిథిగా నందమూరి బాలకృష్ణతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు.

ఈ ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ వస్తారని ప్రచారం జరిగింది. ఈ మేరకు ఉత్సవ కమిటీ మెట్రో పిల్లర్ల వెంట ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసింది. వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సీతారాం ఏచూరి (సీపీఎం) డీ రాజా(సీపీఐ), పురంధేశ్వరి(బీజేపీ), పవన్ కల్యాణ్​ (జనసేన) హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినీ ప్రముఖులు వెంకటేశ్, ప్రభాస్, అల్లు అర్జున్, కళ్యాణ్​ రాం, జయప్రద, మురళీ మోహన్, రాఘవేంద్రరావు, ఆదిశేషగిరి రావు, అశ్వనీదత్, కన్నడ హీరో రాజ్ కుమార్ హాజరవుతున్నారని నిర్వాహక కమిటీ ప్రకటించింది. ఈ ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది.

ఈ మేరకు ఆయన పీఆర్ టీం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. “మే 20వ తేదీన హైదరాబాద్ లో జరగనున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావడం లేదు. తన 40వ జన్మదినోత్సవాన్ని కుటుంబ సభ్యులతో జరుపుకొంటున్నారు. ఈ రోజు కుటుంబ సభ్యులకు సమయం కేటాయించడం కోసం ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు’ అని పేర్కొంది. ఎన్టీఆర్ హాజరు కాకపోవడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ కు, నారా ఫ్యామిలీకి మధ్య  విభేదాలున్నాయని కొద్ది రోజులుగా వస్తున్న వార్తలకు ఈ పరిణామం బలం చేకూర్చినట్లయింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా రకరకాల కామెంట్లు వస్తున్నాయి. 

 ఖమ్మం ప్రోగ్రామ్ కూ వెళ్లరా..?

ఖమ్మం లకారం చెరువులో ప్రతిష్టిస్తున్న 54 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహావిష్కరణకు రావాలని నిర్వాహక కమిటీ ముఖ్యడు, రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. శ్రీ కృష్ణుడిలా ఎన్టీఆర్ విగ్రహాన్ని తయారు చేయించారు. దీనిపై ఇస్కాన్, యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టను ఆశ్రయించాయి. అయితే ఈ విగ్రహావిష్కరణకు కూడా జూనియర్ వెళ్లడం లేదని తెలుస్తోంది. తనకు ఆహ్వాన పత్రిక అందించిన రోజే ఈ విషయాన్ని మంత్రి పువ్వాడకు తారక్ చెప్పారని ప్రచారం జరుగుతోంది. ఆ రోజు వెళ్తారా..? లేదా..? అన్నది హాట్ టాపిక్ గా  మారింది.