
నాగర్కర్నూల్, వెలుగు : కాంగ్రెస్లో చేరేందుకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి కొడుకు డా.రాజేశ్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి తదితరులు తరలివెళ్లారు. బుధవారం సాయంత్రం ఏఐసీసీ ఆఫీస్లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకోనున్నట్టు సమాచారం. కొల్లాపూర్లో జులై 20,30 తేదీల్లో బహిరంగ సభ నిర్వహించి ఏఐసీసీ జనరల్సెక్రటరీ ప్రియాంకగాంధీ సమక్షంలో పార్టీలో చేరాలని జూపల్లి, ఇతర నేతలు భావించారు.
అయితే, వర్షాల కారణంగా సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆగస్టు మొదటి వారంలో నిర్వహించాలని అనుకున్నా వాతావరణం అనుకూలించకపోవడంతో వెనక్కి తగ్గారు. చేరిక ఆలస్యమయ్యే కొద్దీ తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఫీడ్బ్యాక్తో పాటు కొల్లాపూర్లోని పాత కాంగ్రెస్లీడర్లు, కార్యకర్తలు జూపల్లిని పబ్లిక్గా చాలెంజ్చేసే వాతావరణం ఏర్పడుతుండడంతో ఢిల్లీ టూర్ ఫిక్స్ చేసుకున్నారని సమాచారం. టీపీసీసీ పెద్దలు కూడా ఇదే సలహా ఇవ్వడంతో జూపల్లి, ఇతర నేతలు పార్టీలో చేరేందుకు ఢిల్లీకి వెళ్లినట్లు తెలిసింది. వాతావరణం అనుకూలిస్తే కొల్లాపూర్లో త్వరలోనే ప్రియాంకగాంధీ సభ నిర్వహించాలని స్టేట్పార్టీ నిర్ణయించినట్టు సమాచారం.