ఏప్రిల్ 6న కాంగ్రెస్​లోకి కేకే?

ఏప్రిల్ 6న కాంగ్రెస్​లోకి కేకే?
  • సోనియా గాంధీ సమక్షంలో చేరేందుకు యోచన
  • కేశవరావు ఇంట్లో డిన్నర్​.. హాజరైన సీఎం రేవంత్​,  దీపాదాస్​ మున్షీ, 
  • వివేక్​ వెంకట స్వామి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ

హైదరాబాద్​, వెలుగు: రెండు రోజుల క్రితమే బీఆర్ఎస్​ను వీడిన సీనియర్​ లీడర్​, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కాంగ్రెస్​ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 6న ఆయన కాంగ్రెస్​కండువా కప్పుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి బంజారాహిల్స్​లోని కేకే ఇంటికి సీఎం రేవంత్​ రెడ్డి, కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి దీపాదాస్​ మున్షీ వెళ్లారు. కేకే డిన్నర్​ ఏర్పాట్లు చేయగా, మంత్రులు పొన్నం ప్రభాకర్​, తుమ్మల నాగేశ్వర్​ రావు, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్​ రెడ్డి, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్​ యాదవ్​, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు వినోద్​, దానం నాగేందర్, సీనియర్​ నేతలు జానా రెడ్డి, గీతా రెడ్డి హాజరయ్యారు. డిన్నర్​ తర్వాత కేకే పార్టీలో చేరే అంశంపై చర్చ జరిగినట్టు తెలిసింది. కాగా, శనివారం ఉదయం దీపాదాస్​ మున్షీ, రేవంత్ ​రెడ్డి సమక్షంలో కేకే కూతురు, జీహెచ్ఎంసీ మేయర్​ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్​ పార్టీలో చేరారు.  ఆమెతో పాటు అల్విన్ కాలనీ కార్పొరేటర్​ వెంకటేశ్ గౌడ్​ కూడా కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. కేకే కూడా పార్టీలో చేరే అంశంపై చర్చకు వచ్చినట్టు తెలిసింది. వచ్చే నెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్​ జన జాతర సభను నిర్వహిస్తున్న నేపథ్యంలో.. సోనియా గాంధీని ఆ సభకు ఆహ్వానిస్తున్నట్టు చెప్తున్నారు. దీంతో ఆమె సమక్షంలోనే సభ జరిగే రోజు ఉదయం ఓ హోటల్​లో కాంగ్రెస్​లో కేకే చేరుతారని తెలుస్తున్నది. అనంతరం సభలో పాల్గొంటారని పార్టీ వర్గాల సమాచారం. కాగా, తాను ఎవరిపైనా విమర్శలు చేయదల్చుకోలేదని డిన్నర్​ సందర్భంగా మేయర్​ విజయలక్ష్మి అన్నారు. బీఆర్​ఎస్​ అందించిన ప్రోత్సాహం వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అభివృద్ధి కోసమే కాంగ్రెస్​ పార్టీలో చేరానని ఆమె చెప్పుకొచ్చారు.