పూలే కన్న కలలను మోదీ నిజం చేస్తున్నారు : బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్

పూలే కన్న కలలను మోదీ నిజం చేస్తున్నారు :  బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్
  •     బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ 
  •     మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకునే కుట్ర చేస్తుందని ఆరోపణ 
  •     బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి 

హైదరాబాద్, వెలుగు: మహాత్మా జ్యోతిరావు పూలే కన్న కలలను ప్రధాని నరేంద్ర మోదీ నిజం చేస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌‌‌‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జ్యోతిరావుపూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ లక్ష్మణ్​మాట్లాడుతూ విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి పూలే అని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని చెప్పారు. 

మోదీ మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచారని కొనియాడారు. కేంద్ర క్యాబినెట్‌‌‌‌లో 70 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులు ఉన్నారంటే అది మోదీ చొరవేనని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌‌‌‌కు భవిష్యత్​ లేదనే భయంతోనే అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దక్షిణాది, ఉత్తరాది అంటూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. 

విద్యతోనే దేశ వికాసం: బూర నర్సయ్య గౌడ్..

విద్యతోనే భారతదేశం వికసిస్తుందని, 200 ఏండ్ల క్రితమే జ్యోతిరావుపూలే చెప్పారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గుర్తుచేశారు. మహిళా సాధికారత కోసం కేంద్రం చేస్తున్న కృషికి అందరూ సహకరించాలని కోరారు. పూలే ఆశయాల సాధనే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు కాసం వెంకటేశ్వర్లు,  ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.