రైతులు కోరితే  కేసీఆర్​పై పోటీ చేస్తా : కేఏ పాల్​ 

రైతులు కోరితే  కేసీఆర్​పై పోటీ చేస్తా : కేఏ పాల్​ 

కామారెడ్డి, వెలుగు: మాస్టర్​ప్లాన్​ బాధిత రైతులంతా ఏకమై కామారెడ్డిలో కేసీఆర్​ను ఓడించాలని ప్రజాశాంతి పార్టీ చీఫ్​ కేఏ పాల్​ కోరారు. కామారెడ్డి జిల్లా సదాశివ్​నగర్​ మండలం అడ్లూర్​ ఎల్లారెడ్డిలో మాస్టర్​ ప్లాన్​ బాధిత రైతులు గురువారం  సమావేశమయ్యారు. దీనికి పాల్​హాజరై, భవిష్యత్​ కార్యచరణపై చర్చించారు. మాస్టర్​ ప్లాన్​ బాధిత రైతులు 100 మంది కేసీఆర్​పై పోటీ చేస్తే ఓట్లు చీలుతాయని అభిప్రాయపడ్డారు.100 మంది కాకుండా బాధిత రైతుల్లో నుంచి ఒకరిని పోటీకి దింపాలని కోరారు.

పోటీ చేసే రైతు తరఫున తానే పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తానన్నారు. బాధిత రైతులు 2 వేల మంది ఉంటారని, వీరి ఫ్యామిలీ ఓట్లు కలుపుకొని 8 వేల ఓట్లు ఉంటాయన్నారు. 8 వేల మంది తలా10 ఓట్లు వేయిస్తే 80 వేల ఓట్లు వస్తాయన్నారు. అయితే, తమ తరఫున పోటీ చేస్తే మద్దతు తెలుపుతామని రైతులు కేఏ పాల్​తో చెప్పారు. రైతులంతా ఐక్యంగా ఉండి పోరాటంతో పాటు, ఎన్నికల్లో ప్రచారం చేస్తే పోటీపై ఆలోచిస్తాననని కేఏపాల్​ సమాధానమిచ్చారు.

కామారెడ్డి మాస్టర్​ ప్లాన్​ను రద్దు చేస్తున్నట్లు కేసీఆర్​ 72 గంటల్లో స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకపోతే ఆదివారం 2 వేల మంది రైతులతో మీటింగ్​నిర్వహించి పోటీపై నిర్ణయం వెల్లడిస్తానన్నారు. రైతుల తరపున ఒకరు పోటీలో నిలిచి, గెలిస్తే ప్రపంచం మొత్తం కామారెడ్డి వైపు చూస్తుందన్నారు. ఒకవేళ తనను నిలబెట్టి గెలిపిస్తే కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ ​నిర్మించి దేశ, విదేశాల నుంచి డాక్టర్లను తీసుకువస్తానన్నారు. మండలానికి రెండు అంబులెన్సులతో పాటు, హాస్పిటల్​కు హెలిక్యాప్టర్​ సమకూరుస్తానన్నారు.  

కేజీ టూ పీజీ ఉచిత విద్య కోసం స్కూల్, కాలేజీ నిర్మాణం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాన్నారు. ఇవన్ని తన సొంత పైసలతో 3 నుంచి 6 నెలల్లో కంప్లీట్ ​చేస్తానన్నారు. కేసీఆర్, కేటీఆర్​లు తనతో డిబేట్​కు వస్తే ధరణిలో అవినీతి, ఇతర అక్రమాలను పూర్తి ఆధారాలతో నిరూపిస్తానని సవాల్ ​విసిరారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​ లు ఒక్కటేనన్నారు. రైతుల భూములు ఎక్కడికి పోవని తాను వారికి అండగా నిలుస్తానన్నారు. మాస్టర్ ​ప్లాన్ ​బాధిత రైతుల పక్షాన తాను హైకోర్టులో కేసు వేసినట్లు చెప్పారు.